Hyderabad : నల్ల చెరువు వద్ద గంగమ్మ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హారతి..!
హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకుందాం. చెరువులను పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలను తొలగించుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాం..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Hyderabad : నల్ల చెరువు వద్ద గంగమ్మ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హారతి..!
“హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకుందాం. చెరువులను పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలను తొలగించుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాం..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కూకట్పల్లిలో హైడ్రా HYDRAA పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
“దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అయితే, ఆక్రమణలు తొలగించి, కాలుష్యం నివారించి మూసీ నదిని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, హైడ్రా పనులు ప్రారంభించినప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. ఇందులో నాకెలాంటి దురుద్దేశం లేదు. నల్లచెరువును పునరుద్ధరించిన తర్వాత వేలాది మంది మొహాల్లో ఆనందం చూసినప్పుడు సంతోషం కలిగింది.
పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించుకుందాం. ఇలాంటి పనులు చేసుకునప్పుడు నిజంగానే కొందరికి నష్టం కలిగి ఉండొచ్చు. పేదవారు ఎవరికీ అన్యాయం చేయను. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశాం. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందాం.
నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం. అహ్మదాబాద్లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ నిర్మించుకుని ఆ నగరాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు మనమెందుకు మూసీని ప్రక్షాళన చేయకూడదు” అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, రామచంద్రు నాయక్ , ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









