Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!

Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!
నల్లగొండ, మన సాక్షి :
పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారని, తాను 2004 సంవత్సరంలో శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఒక్కో గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు 15 కోట్ల వరకు రుణాలు ఇప్పించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అన్ని పథకాల లబ్ధిని మహిళలకి ఇస్తున్నదని, ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటివి ఉదాహరణగా చెప్పారు.
మహిళా సంఘాల సభ్యులు కలిసికట్టుగా పని చేసుకోవాలని కోరారు. ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ భవిష్యత్తులో బాగా నడుస్తుందని, మెడికల్ కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల, ఇటు హైదరాబాద్ రహదారికి ,నాగార్జునసాగర్ రహదారికి చేరువలో ఉండటం, పెట్రోల్ పంపు తో పాటు, ఏవి చార్జింగ్ మిషన్, కేఫ్ టేరియా,సూపర్ మార్కెట్ వంటివి ఇక్కడ బాగా నడుస్తాయని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆస్పత్రికి మంచి వైద్య సేవలు అందిస్తున్నదని, ఇటీవలే ఏ ఐ జి ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాల తో పాటు, జిజిహెచ్ ను దత్తత తీసుకున్నదని, కనగల్ లో పి హెచ్ డి లో గ్లూకోమా సెంటర్ ఏర్పాటు చేశామని, మహిళల ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాములలో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
మహిళలు బాగా పనిచేస్తే ఆర్థికంగా పురుషులతో పాటు, సమానంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.సెర్ప్ సి ఈ ఓ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయ సంఘాలకు 20వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామని, చిన్న సంఘాల ద్వారానే మహిళల్లో ధైర్యం వస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే మహిళ ముందడుగు వేస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని స్వయం సహాయక మహిళా సంఘాలలోని సభ్యులకు ప్రతి ఇంటికి రుణం వెళ్లే విధంగా చూడాలని అన్నారు.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించగా, రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల ఆదాయం వస్తే నల్గొండ జిల్లాలో కోటీ 40 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో సైతం 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలు రాష్ట్రంలో ఆదాయం అర్జించారని, ప్రభుత్వము మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంతో పాటు ఆరోగ్యం, పిల్లల చదువు, పౌష్టికాహారం అందించాలని, గ్రామాలలో గృహహింసకు వ్యతిరేకంగా మహిళలకు తోడుగా నిలవాలని, ఆరోగ్యం, సామాజిక భద్రత చూసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మహిళలు వాణిజ్య, వ్యవసాయ రంగాలలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన పెట్రోల్ పంపును సక్రమంగా నిర్వహించుకోవాలని, నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు మూడవదని, మరో మూడు పెట్రోల్ పంపులు జిల్లాకు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఐ ఓ సి ఎల్ జనరల్ మేనేజర్ సుదీప్ రాయ్, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపుకలెక్టర్. జె. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి ఫిష్ ఔట్లెట్ ను ప్రారంభించారు.
MOST READ :
-
Hydra : రూ.500 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రహరీ, షెడ్ తొలగింపు..!
-
Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Miryalaguda : ఉత్తమ ఉపాధ్యాయురాలకు సన్మానం..!











