Miryalaguda : యూరియా యాప్ తొలగించాలి.. నేరుగా సరిపడా విక్రయించాలి..!
యూరియా కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ను తొలగించి రైతులకు నేరుగా సరిపడా యూరియా అందజేయాలని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైతుబంధు సమితి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

Miryalaguda : యూరియా యాప్ తొలగించాలి.. నేరుగా సరిపడా విక్రయించాలి..!
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి:
యూరియా కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ను తొలగించి రైతులకు నేరుగా సరిపడా యూరియా అందజేయాలని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైతుబంధు సమితి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాప్ ను తొలగించని పక్షంలో రైతుల శ్రేయస్సుకోసం, ఒక రైతుగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
వ్యవసాయానికి యాసంగి సీజన్ లో ప్రతి ఎకరాకు మూడు బస్తాల యూరియా తప్పనిసరి అని అన్నారు. యూరియా నమోదు యాప్ దరఖాస్తు చేసే సమయంలో సెకండ్స్ లలో యాప్ తొలగిపోతుందన్నారు. సుమారు 90 శాతం మంది రైతులు స్మార్ట్ ఫోన్లు లేనివారు ఉన్నారని, అక్షరాస్యత లేని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియదని ఆయన అన్నారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు కంటే ట్రాన్స్ పోర్ట్ చార్జీల ధర ఎక్కువైతుందన్నారు. చిన్న రైతులకు, కౌలు రైతులకు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఆన్ లైన్ లో సర్వర్ వైఫల్యాలు సాంకేతిక లోపాలు సంభవిస్తున్నాయన్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతులు యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఆన్ లైన్ బిజీగా ఉండి నమోదు చేసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. యాప్ లో అసైన్డ్ ల్యాండ్ ఆప్షన్ లేకపోవడం వల్ల అసైన్డ్ భూములు సాగు చేసుకునే రైతులు యూరియాకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు పొట్ట దశ కంటే ముందే యూరియా అవసరం ఉందని, చాలామంది రైతులకు పొట్ట దశలో ఉన్న పంటలకు ఒక యూరియా బస్తా కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు కావలసినంత యూరియా వెంటనే అందించాలని, లేకుంటే పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. వ్యవసాయ ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని వెంటనే యూరియా యాప్ ను తొలగించి, రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ నల్గొండ జిల్లా అధికారికి ఈ విషయలపై వినతి పత్రాలను అందజేశామని తెలిపారు.
రైతులకు న్యాయం చేసేందుకు, రైతుల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు వెనకాడనని చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట రైతు ప్రతినిధులు హాతిరాం నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ తదితరులు ఉన్నారు.









