Rythu Bharosa : రైతు భరోసాకు రూ.7500 కోట్లు.. స్పష్టం చేసిన మంత్రి తుమ్మల..!
Rythu Bharosa : రైతు భరోసాకు రూ.7500 కోట్లు.. స్పష్టం చేసిన మంత్రి తుమ్మల..!
నల్లగొండ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్ బి సీ బత్తాయి మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గడచిన 5 సంవత్సరాలలో రైతుకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నదని, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్ల కార్డులు కలిగిన రైతులకు ఇది వరకే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి తెల్ల కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు ఘమచేస్తామని తెలిపారు. 2 లక్షల రూపాయల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎట్టి పరిస్థితులలో ఈ పంట కాలంలోనే
31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
దీంతోపాటు ,పంట కాలానికి 7500 రూపాయలు రైతు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా చేస్తామని వెల్లడించారు. అలాగే ఈ సంవత్సరం నుండే రైతు పంటల బీమా ను సైతం అమలు చేస్తామని, రైతులు ఏ పంట వేసిన ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు పంట బీమా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులు ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పత్తి ని సైతం అలాగే తేవాలని, ఈ సంవత్సరం తెలంగాణలో కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ తయారుకానుందని తెలిపారు.
జనవరి నుండి రేషన్ కార్డుల ద్వారా అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, అందుకే సన్న రకాలకు మద్దతు ధర తో పాటు, 500 రూపాయల బోనస్ వస్తుంది అని అన్నారు .ఆయిల్ ఫామ్ వల్ల మంచి లాభాలు, దిగుబడి ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 10 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ వేసారని ,ప్రతి ఎకరాకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆయిల్ ఫామ్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని, అందువల్ల రైతులు ఆయిల్ పామ్ తోటలు వేయాలని ఆయన కోరారు.
ఇంకా 70 లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు వేసే అవకాశం ఉందని, 5 సంవత్సరాలలో తెలంగాణలో 10 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నామని, తర్వాత నల్గొండలో ఫాక్టరీ కట్టిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయం చేసేందుకు, రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. రైతు రుణ మాఫీ లో భాగంగా ఇప్పటి వరకే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని, నల్గొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండుతుందని,రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్ ఎల్ బి సి వద్ద గతంలో బత్తాయి కోసం నిర్మించిన షెడ్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు.
అనంతపూర్ తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా బత్తాయి సాగు జరుగుతుందని ,సుమారు 50000 ఎకరాలలో బత్తాయి సాగు చేస్తారని తెలిపారు.జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భాగంగా నల్గొండ జిల్లాలో 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకే 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, ఈ వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని, కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు,తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీడీవో, ఏపిఎం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల ద్వారా ప్రతి కేంద్రానికి ఒక ఇన్చార్జి ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
పత్తి కొనుగోలు లో భాగంగా జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లులు ఉండగా, రెండు కేంద్రాలు పెండింగ్లో ఉన్నాయని, ఈ సంవత్సరం 3,52,000 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్ కి వస్తుందని అంచనా వేయడం జరిగిందని ,బుధవారం నుండి జిల్లాలో పత్తి కొనుగోలును ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోనిరమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, స్థానిక కౌన్సిలర్ అలివేలు, డిసిసిబి డైరెక్టర్ సైదులు,
పిఎసిఎస్ డైరెక్టర్లు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్,మార్కెటింగ్ జిల్లా అధికారి ఛాయా దేవి, ఆర్డీవో శ్రీదేవి, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.
MOST READ :
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
Cm Revanth Reddy : సొంతూరులో సీఎం రేవంత్.. వామ్మో హెలికాప్టర్ అదిరింది..!
Thummala : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన..!










