NALGONDA : వైద్యుల తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ అసహానం.. డ్యూటీ డాక్టర్ తో పాటు నలుగురు నర్సుల సస్పెండ్..!
NALGONDA : వైద్యుల తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ అసహానం.. డ్యూటీ డాక్టర్ తో పాటు నలుగురు నర్సుల సస్పెండ్..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కుర్చీలో మహిళ ప్రసవం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కుర్చీలో ప్రసవించిన అశ్విని, వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి పూర్తి వివారాలు తెలుసుకున్నారు. అంతేకాక ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ ఎం ఓ ,డ్యూటీ డాక్టర్ ల తో సంఘటన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం రాత్రి నల్గొండ ప్రధాన ఆసుపత్రిలో కుర్చీలో ప్రసవం జరిగినట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే ఆసుపత్రి డాక్టర్లను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రస్తుతం తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ,క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.
నల్గొండ జిల్లా నెరేడుగొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లిన సందర్భంలో అక్కడ డాక్టర్ లేనందున డ్యూటీలో ఉన్న నర్సులు అంబులెన్స్ ను ఏర్పాటు చేసి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిసిందని వెల్లడించారు.
గర్భిణీ అశ్విని అంబులెన్స్ లో తన కుటుంబ సభ్యులతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి రాత్రి సుమారు 12:30 గంటలకు వచ్చిందని, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ నిఖిత మరియు డ్యూటీలో ఉన్న నర్సులు అశ్వినిని పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని గుర్తించడం , అంతేకాక నొప్పులు ఆగి ఆగి వస్తుండడాన్ని గమనించి లేబర్ రూమ్ కి తీసుకెళ్లి డ్రెస్ మార్చు కోమని చెప్పారని, 30 నిమిషాల తర్వాత రెండోసారి బిపి పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉన్నందున వైద్య నిబంధనల ప్రకారం నడవమని చెప్పారని తెలిపారు.
రాత్రి సుమారు రెండు గంటల సమయంలో అశ్విని మళ్ళీ నడుస్తున్న క్రమంలో లేబర్ రూమ్ ముందు నొప్పి రావడంతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా వెంటనే ప్రసవం అయి బిడ్డ బయటకు వచ్చేసిందని, అక్కడే ఉన్న అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకుని వెంటనే డాక్టర్ను పిలువగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారని ,బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.
అయితే ఇలాంటి సందర్భాలలో అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా నడవమని సలహా ఇచ్చిన నర్సు లేదా ఇతరుల ప్రోత్సాహంతో నే ఇలాంటి సంఘటన జరిగినట్లు గుర్తించామని, దీనికి బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖిత, స్టాప్ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ , సుజాతలకు సోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
దీనిపై వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతేకాక గురువారం రాత్రి డ్యూటీ లో ఉండాల్సిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూప డ్యూటీలో ఉండకపోగా, అందుబాటులో లేకపోవడం, ఈ విషయమై నర్సులు మాట్లాడగా అనస్తేసియా డాక్టర్ లేనందువల్ల గర్భిణీని ప్రసవం కోసం నల్గొండకు పంపించినట్లు తెలిపారని.
ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూపతో పాటు, విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి ,సైదమ్మ,మౌనిక, సరితలను సస్పెండ్ చేయాలని డిసిహెచ్ ఎస్ ను ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాను ప్రాథమిక నివేదికను సమర్పించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ తో పాటు, నలుగురు నర్సులపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రులలోనే పసవాలు జరగాలన్నదే ప్రభుత్వ ఆశయమని , ప్రసవాల విషయంలో ఎవరైనా నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులను పట్టిష్టం చేస్తున్నామని, ప్రైవేట్ ఆస్పత్రులలో 80 శాతం సిజేరియన్ ప్రసవాలవుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రులలో 50 శాతం కన్నా తక్కువున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.
సాధారణ, సిజేరియన్ అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అయితే డాక్టర్లు, అనెస్థీషియా ఇతర సర్జన్ ల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రులతో 24 గంటలు సేవలందించేలా చూస్తున్నామన్నారు. ఇటీవలి ట్రాన్స్ఫర్ల సందర్భంగా ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జిల్లా ఆసుపత్రి నుండి బదిలీ కాగా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా తిరిగి భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు.
సంఘటన జరిగిన రోజు రాత్రి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మొత్తం (9) ప్రసవాలు జరిగాయని, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోజువారి ఆరోగ్య సేవల పరిస్థితి పై ఒక కన్నేసి ఉంచడం జరిగిందని,వైద్య సేవల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యల తీసుకుంటున్నామని వెల్లడించారు.
LATEST NEWS :
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









