Suryapet : అభివృద్ధి, మెరుగైన జీవితాల కోసం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు..!
Suryapet : అభివృద్ధి, మెరుగైన జీవితాల కోసం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు..!
-
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
-
సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన
సూర్యాపేట, మనసాక్షి:
అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందేందుకు, తద్వారా మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం అయన సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు.
జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ముందుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర గవర్నర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా అధికారులు, ప్రముఖులతో సమావేశ మందిరంలో ముఖాముఖి సమావేశం అయ్యారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేట జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు.
ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేకించి సూర్యాపేట లాంటి జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుండి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సూర్యపేట జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారత పై ఆధారపడి ఉందని, ఈ విషయం తాను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా సహాయక మహిళలు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన లో గుర్తించానని చెప్పారు. అలాగే స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళలను సమాజానికి తెలియజేయాలని అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారని అన్నారు .
మహిళల చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల మెరుగు కోసం కృషి చేయడం చాలా ముఖ్యమని, సమాజంలో ఉన్న చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు .దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు.
సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 96.91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, చిన్న చిన్న పరికరాల వంటివి తెలియజేస్తే వారు ఇంకా విజ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉందని అన్నారు.
అలాగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని ఆయన చెప్పారు.
పేరిణి రాజ్ కుమార్, వాలీబాల్ ప్లేయర్ సుధాకర్ రెడ్డి, నేషనల్ కబడ్డీ ప్లేయర్ రవీందర్ రెడ్డి , జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత మధుసూదన్ రావు, విద్యారంగంలో కృషి చేసిన వెంకటేశ్వర్లు ,కాటుకూరి చంద్రారెడ్డి, తూము శ్రీనివాసరావు, వీర మహాదేవ్, ఉమారాణి పంచాయతీ కార్యదర్శి ,కొత్త భద్రయ్య చారి, షేక్ ముస్తఫా ,డాక్టర్ ఆనంద్, డాక్టర్ నందగోపాల్, అడ్వకేట్ శశిధర్, ప్రొగ్రెసివ్ ఫార్మర్ శేషు కుమార్, ఉత్తమ వ్యవసాయ జర్నలిస్టు ఎం గోపయ్య , కవి పెద్దిరెడ్డి గణేష్ ,థియేటర్ ఆర్టిస్టు వేముల వెంకటేశ్వర్లు, షీలా అవలీల, కవి, ఉపాధ్యాయుడు, రచయిత జి. వెంకటేశ్వర్లు, సిమెంటు ఇండస్ట్రీ డివిఎస్సార్ రాఘవరావు, వేముల నాగరాజు ,కెమికల్ ఇంజనీర్ రమేష్ బాబు, సాగర్ సిమెంట్ రమణమూర్తి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు దివ్య భవాని, ఎడవల్లి అనిల్ కుమార్ తదితరులు మాట్లాడారు.
కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్ ,జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
(Reporting : MuthyamRaju, Suryapet)
LATEST UPDATE :
-
District Collector : వంటగదిలో జిల్లా కలెక్టర్..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
-
High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ నిరోధించడానికి ఆహారంలో ఇవి తీసుకోండి.. గుండె సురక్షితం, జబ్బులు దూరం..!
-
Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
-
Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!










