తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

Ponguleti : భూభారతి చట్టం.. రైతుల చుట్టం..!

Ponguleti : భూభారతి చట్టం.. రైతుల చుట్టం..!

18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం..

ప్రజలు మేధావులతో చర్చించాకే
చట్టంగా రూపొందించాం..

ధరణితో రైతులు అరిగోసపడ్డారు..

జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు..

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం..

రైతులను అధికారులు ఆత్మీయంగా..అక్కున చేర్చుకోవాలి..
ఇబ్బంది పెట్టవద్దు..భూసమస్యలు పరిష్కరించాలి..

త్వరలో ధర్మపురికి ఆర్డిఓ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల మంజూరు..

ప్రభుత్వం ప్రకటన చేస్తే ధర్మపురిదే మొదటి పేరు..

జగిత్యాల, (మన సాక్షి)

భూభారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు, ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో లక్షలాదిమంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశంలోని రోల్ మోడల్ గా నిలుస్తుందని, 18 రాష్ట్రాలలో భూ చట్టాలపై అధ్యయనం చేశామని, అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారావు తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు.

రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ రెండు నుంచి రాష్ట్రంలోని పదివేల పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వివిధ భూ సమస్యలకు సంబంధించి 13వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తాసిల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ వరకు అధికారాలను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు.

భూ సమస్యలకు సంబంధించి ఆపిల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల ఆఖరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని ఈ కార్యక్రమము ఐదేళ్ల వరకు కొనసాగుతుందని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో 28 గ్రామాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటిలో అత్యధికంగా సాదా బైనామాలకు సంబంధించిన భూ సమస్యలే వచ్చాయని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భూ సమస్యలు పరిష్కారం కాక కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింన్నారు. ధరణిలో ఉన్న లోపాల వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేకపోయాయని, గత ప్రభుత్వ హాయంలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పది లక్షల భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కంప్యూటర్లోనే ఉంచింది తప్పా పరిష్కారం చూపలేకపోయిందన్నారు.

భూభారతి చట్టంలో ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, భూమికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూ పంచాయతీలు రాకుండా చట్టంలో పలు అంశాలను పొందుపరీచామని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూమిని సర్వే చేసుకునే రైతులకు సంబంధించి పాసుబుక్ లో మ్యాపులను పొందుపరుస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమికి సంబంధించిన సర్వే మ్యాప్ ను కూడా పొందుపరుస్తామన్నారు.

భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా 10956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని తెలిపారు. డిసెంబర్ 31 కి భూమి అమ్మకాలు..కొనుగోలు సంబంధించి పక్కాగా లెక్కలు తీసేలా భూభారతి చట్టంలో రూపొందించామని తెలిపారు.

భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలు మెప్పు పొందే చట్టమని, అద్భుతమైన భూభారతి పథకాన్ని రైతులంతా చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ధర్మపురి లో ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే మొదటగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ పాలన అంటేనే పేదల కష్టాలు తీరుస్తుందన్నారు. అదేవిధంగా ఎండపల్లి బీర్పూర్ మండలాలకు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు రైతులను ప్రేమగా బాధ్యతాయుతంగా అక్కున చేర్చుకొని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.


భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం..రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

రైతులు ఇబ్బందులు పడకుండా వారి భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి వల్ల రైతుల అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణి వల్ల రైతులు అరిగోషపడ్డారని, భూభారతి చట్టం రైతులకు చుట్టమని చెప్పారు. రైతులు చట్టాన్ని ఉపయోగించుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

గత పాలకుల నిర్వాకం వల్ల రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. ధర్మపురి లో రెవెన్యూ డివిజన్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఇందుకోసం మంత్రి సానుకూలంగా స్పందించారు. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి నియోజకవర్గంలో సాగునీటిని అందించకుండా కేసీఆర్ హరీష్ రావు తమ సొంత ప్రాంతాలకు తీసుకెళ్లారని ఆరోపించారు.

నాడు అధికారంలో ఉండగా బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల అండదండలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నది..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

గతంలో ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇందిరమ్మ ఇండ్లు నేటికీ గ్రామాల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు.

మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తూ సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఇందిరమ్మ నిల నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం అద్భుతంగా ఉందన్నారు. భూభారతి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో తనకు మాట్లాడే అవకాశం దక్కడం జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని, నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు.

భూ సమస్యల పరిష్కారానికి
ప్రత్యేక దృష్టి.. గ్రామాల వారీగా పక్కాగా
భూ రికార్డులు..
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, భూ సమస్యలకు సంబంధించి 844 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అత్యధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనీ, భూ సమస్యలను అన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు భూ రికార్డులు భద్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు భూభారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని సమస్యల పరిష్కారానికి చక్కగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పలువురు రైతులకు భూమి హక్కు పత్రాలను అందించారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, గజమాలతో ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు