Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Komatireddy Venkatreddy : ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..!

Komatireddy Venkatreddy : ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..!

నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో సుమారు 37.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అకడమిక్ భవనం, విద్యార్థినిల వసతి గృహం, అంతర్గత సిసి రహదారుల పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పనులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఇందుకు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలని అన్నారు.

నల్గొండ జిల్లా కలెక్టర్ మహిళ అని ఆమెను స్పూర్తిగా తీసుకొని చదవాలని, అమ్మాయిలకు పిలుపునిచ్చారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. యూనివర్సిటీలో జిమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఇటీవల కాలంలో అన్ని కులాల విద్యార్థులకు ఒకే దగ్గర ఉండే విధంగా 150 నుండి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్లు కట్టిస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఐటీ శాఖ సహకారంతో, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు దృష్టి సారిస్తానని తెలిపారు .అలాగే యూనివర్సిటీ విద్యార్తినిలను దృష్టిలో ఉంచుకొని ప్రతివారం ఒక గైనకాలజిస్ట్ ను, జనరల్ ఫిజిషియన్ ను యూనివర్సిటీకి పంపించడం జరుగుతుందని చెప్పారు. అమ్మాయిలు బాగా చదువుకోవాలని, ప్రస్తుతం ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తున్నారని తెలిపారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాప్ హుసేన్ మాట్లాడుతూ 254 ఎకరాలలో విస్తరించి ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో కొత్త అకాడమిక్ భవనాలతో పాటు, సైన్స్ భవనం అవసరము ఉన్నాయని, అంతేకాక బీఈడీ,లా , నైపుణ్యాల అభివృద్ధి సంస్థ వంటి కోర్సులు, వాటికి వసతులు కావాలని, ఇందుకోసం మొత్తం 350 కోట్ల రూపాయల ప్రతిపాదనలను రూపొందించడం జరిగిందని, వాటిని మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వీసీ అల్తాఫ్ హుసైన్ గోనరెడ్డి రిజిస్ట్రార్ రవికుమార్, శైలజ ప్రొఫెసర్లు ,అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరులు హాజరాయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు