KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!

KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు.
హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపుల్లో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు.
తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ను కేసీఆర్ మార్చారని వ్యాఖ్యానించారు. అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్కు రాకుండా… మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లుేశారని గుర్తు చేశారు.హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.
దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చివేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు.
కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
మళ్లీ గెలిచి చూపించండి:
శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు.
MOST READ :
-
District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!
-
Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
-
ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!
-
PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!









