District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితిపై వెల్లడి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితిపై వెల్లడి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నిర్దేశించిన ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేయరాదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రెండో సాదారణ ఎన్నికల్లో పోటీ చేసే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు బుధవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిర్దేశించిన వ్యయం ప్రకారమే ఆయా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
అయితే ఎన్నికల్లో పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి లక్షా 50 వేలు, సర్పంచి అభ్యర్థుల ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి 2లక్షల 50 వేలు (5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలో) అంతలోపు జనాభా ఉన్న పంచాయతీలలో లక్షా 50 వేలు మాత్రమే అని, దీనిని అనుసరించి ఆయా గ్రామ పంచాయతీలలో వార్డు అభ్యర్థుల ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి 30 నుంచి 50 వేలు ఉంటుందని ఆమె వెల్లడించారు.
నామినేషన్ వేసిన రోజు నుంచి ఓట్ల లెక్కింపు చివరి రోజు వరకు ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చు పరిగణలోకి వస్తుందన్నారు. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థి ఒకవేళ గెలిచినా డిస్ క్వాలిఫై అవుతారని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కొన్నింటిపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కూడిన అధికారుల బృందం తగు నిర్ణయం తీసుకుంటుంది అని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
MOST READ :









