Nalgonda : జిల్లా కలెక్టర్ రైతులకు సూచన.. నాణ్యమైన ధాన్యం తెస్తే మద్దతు ధర..!
రబీలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

Nalgonda : జిల్లా కలెక్టర్ రైతులకు సూచన.. నాణ్యమైన ధాన్యం తెస్తే మద్దతు ధర..!
నల్లగొండ, మన సాక్షి :
రబీలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నల్గొండ సమీపంలోని ఆర్జల బావి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తూర్పార బట్టి తాలు, తరుగు, చెత్త వంటివి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్“ ఏ” ధాన్యానికి ప్రకటించిన 2389 రూపాయలు, కామన్ వెరైటీకి 2369 రూపాయల మద్దతు ధరను పొందవచ్చని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పురబట్టే యంత్రాలను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
ఈ రబీలో జిల్లాలో 401 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు 124 రైస్ మిల్లులను అనుసంధానం చేయగా, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ కొలిచేయంత్రాలు ,తూర్పారబట్టే యంత్రాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అన్ని సిద్ధంగా ఉంచడం జరిగిందని, అంతేకాక సెంటర్ ఇన్చార్జిలకు ఇదివరకె ధాన్యం కొనుగోలుపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సీనియార్టీ ప్రకారం సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేస్తారని ఆయన వెల్లడించారు.
ఈ నెల 2 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల సందర్భంగా చిట్యాల మండలం, ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనాలని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని రైస్ మిల్లర్లతో ఇది వరకే విజ్ఞప్తి చేయడం జరిగిందని, అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన రైస్ మిల్లర్లతో కోరారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో పాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతి , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, తహసిల్దార్ పరుశురాం తదితరులు ఉన్నారు.









