Nalgonda : అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..!

Nalgonda : అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..!
నల్లగొండ, మన సాక్షి :
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో అసాంఘిక కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.
మంగళవారం రాత్రి నల్లగొండ టౌన్, రూరల్ పరిధిలోని ముషంపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీషీటర్ల ఇండ్లలో జిల్లా ఎస్పి ఆకస్మిత తనిఖీ చేసి వారి కదలికల వివరాల పై ఆరా తీసారు.
వారిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేశామని,ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తప్పమన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు కార్యాచరణ రూపొందించి, నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో గత ఎన్నికల కేసుల్లో గొడవల్లో ఉన్న పాత నేరస్థులు,రౌడీ షీటర్స్ లను బైండోవర్ చేసి మళ్ళీ ఇతర నేరాలకు పాల్పడకుండా వారి కదలికల పై నిఘా ఉంచామని అన్నారు.
ఎవరైన బైండోవర్ ఉల్లంఘించి గొడవలకు గాని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి వెంట నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ సైదా బాబు తదితరులున్నారు.










