TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త తెలియజేసింది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద పడి కాపులు కాయకుండా చర్యలు చేపట్టింది. రైతులు ఎరువుల కోసం ప్రత్యేకమైన యాప్ లో బుక్ చేసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు ఆదేశించారు.
ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రైతుల కోసం ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. గంటల తరబడి, రోజుల తరబడి రైతులు దుకాణాల వద్ద ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రైతులు తమకు సమీపంలో ఉన్న డీలర్ తో పాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను కూడా తెలుసుకోవచ్చునని, వారికి అవసరమైన యూరియా పరిమాణం తనకు అనుకూలమైన డీలర్ వద్ద నుంచి అయినా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకమైన యాప్ లో యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగా రైతు తాను ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు, ఏ మేరకు సాగు చేసిన వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది.
రైతులు నమోదు చేసిన వివరాల ఆధారంగా యూరియా ఎంత ఇవ్వాలనే విషయంపై సరఫరా అవుతుంది. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకుగాను హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులోకి వస్తుంది.









