తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : గ్రామపంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : గ్రామపంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు,స్టేజ్ 1 మరియు 2 సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సింగారం కూడలి దగ్గర ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్.ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు.

అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతి రోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ఈ శిక్షణ తరగతుల్లో ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, అదనపు కలెక్టర్ బెన్ షాలం, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!

  2. Nizamabad : సాప్ట్ బాల్ జాతీయస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

  3. Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!

  4. నూర్జాన్ పేట గుట్టల్లో అక్రమసారా తయారీ స్థావరాలపై దాడి..!

  5. Miryalaguda : కోళ్లకు బర్డ్ ఫ్లూ.. తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు..!

మరిన్ని వార్తలు