Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!

Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

వరి పంటకు దోమపోటు వచ్చిందని పురుగుమందులు కొనుగోలు చేసి పిచికారి చేస్తే ఉన్న పొలం ఎండిపోయింది. మూడు ఎకరాలలో పంట ఎండిపోవడంతో ఆందోళన చెందిన రైతు కుటుంబం ఫర్టిలైజర్ షాపు వద్ద ధర్నాకు దిగారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీకి చెందిన ధనావత్ శ్రీహరికి మూడు ఎకరాల పొలం ఉంది. దాంట్లో వరి పంట వేశాడు. కాగా వరికి దోమపోటు, వైరస్ రావడంతో మిర్యాలగూడలోని హనుమాన్ ఫర్టిలైజర్ షాపులో ₹4,700 వెచ్చించి పురుగు మందులు కొనుగోలు చేశాడు.

కాగా ఆ మందులు పిచికారి చేస్తే దోమపోటు తగ్గకపోగా పొలం ఎండిపోయినట్లుగా వాడు పట్టింది. దాంతో ఆ రైతు తిరిగి ఫర్టిలైజర్ షాప్ కు వచ్చి షాపు యజమాని శ్రీనివాసులు నిలదీయగా తప్పుడు మందు ఇచ్చానని మరో మందు తీసుకెళ్లాలని కోరడంతో మరోసారి 1700 రూపాయలు వెచ్చించి మందులు తీసుకెళ్లి పిచికారి చేశాడు.

దాంతో ఉన్న కాస్త పొలం పూర్తిగా ఎండిపోయింది. పంట చేతికొచ్చే ముందు మూడు ఎకరాలలో పంట నష్టం జరిగింది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే దుకాణంలో నకిలీ పురుగు మందులు ఇచ్చారని ఆ రైతు ఆరోపించాడు.

కుటుంబ సభ్యులతో కలిసి ఫర్టిలైజర్ షాపు వద్ద ధర్నాకు దిగాడు. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు