Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. అధికారంలోకి రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట విదితమే.
వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పంటల సాగు చేశారు. రైతు రుణమాఫీ చేయడం వల్ల రైతు భరోసా కాస్త ఆలస్యమైంది. అంతేకాకుండా రైతు భరోసా పథకాన్ని వానాకాలం సీజన్ లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు.
అంతేకాకుండా రైతు బంధు పథకంలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటి అన్నింటిని సరిచేశాకనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకుగాను రైతుల అభిప్రాయాలను రాష్ట్రవ్యాప్తంగా సేకరించింది. మెజారిటీ రైతులు సాగు చేసే భూములకే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతుల అభిప్రాయ సేకరణ ఆధారంగా వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈనెల 20వ తేదీన శుక్రవారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానున్నది. సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా పథకం పై చర్చించి ప్రారంభించే తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రైతులకు దసరా పండుగ కానుకగా దసరా పండుగ రోజు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులు వేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1.54 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు సమాచారం.
కాగా ఏడాదికి ఎకరానికి 15 వేల రూపాయల రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందజేయనున్నది. వానాకాలం సీజన్ లో రూ. 7500, యాసంగి సీజన్ లో రూ.7500 చొప్పున రైతుల ఖాతాలలో పెట్టుబడి సహాయం అందజేయనున్నారు.
అందుకు గాను ప్రస్తుత వానాకాలం సీజన్ కు దసరా పండుగ రోజు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు సమాచారం.
LATEST UPDATE :
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!










