శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదలు భారీగా వస్తున్నాయి. దాంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్ని ఈ ఏడాది అనుకున్న సమయానికే నిండుకుండలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నుండి గేట్లు తెచ్చుకున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు వైపు వరద నీరు పరుగులు పెడుతుంది. దాంతో రైతులకు ఎంతో మేలు జరగనున్నది.
శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 25 వేల 174 క్యూసెక్కుల నీరు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 806.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.3782 టీఎంసీల నీరు ఉంది. కాగా కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20,557 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర కు భారీ వరద :
కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర డ్యామ్ కు 1.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను ప్రస్తుతం 1615 అడుగులగా ఉంది.
మరో రెండు రోజుల్లోనే సాగర్ కు వరద :
అటు జూరాల ప్రాజెక్టు నుంచి ఇప్పటికే వరద నీరు చేరుతుండగా మరో రెండు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి వేరే అవకాశం ఉంది. మరో రెండు రోజులు ఇదేవిధంగా వరదలు కొనసాగితే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి వల్ల 20వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి దిగువకు సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
కాగా మరో రెండు రోజుల్లో శ్రీశైలం కు మరింత వరద వచ్చి చేరే అవకాశం ఉంది. దానివల్ల శ్రీశైలం నుంచి సాగర్ కు వరద రానున్నది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు చేరితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఆనందంతో ఉండనున్నారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టులోని రైతులు పంటలు వేసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి :
తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!










