District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ, పిఓ కు షోకజ్ నోటీసు..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ, పిఓ కు షోకజ్ నోటీసు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడడమే కాకుండా, ఓటు వేసేందుకు గుర్తింపుగా తీసుకువచ్చిన గుర్తింపు కార్డుల గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఒక పోలింగ్ బూతు లో పోలింగ్ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ పరిమితికి మించి ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉండడం పట్ల ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రిసైడింగ్ అధికారి, స్కూల్ అసిస్టెంట్ సంధ్య కు షోకాజ్ నోటీస్ జారిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రతిరోజూ టేలికాన్ఫెరెన్సు తో పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ అనంతరం కౌంటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఆర్ ఓలు అత్యవసరమై బయటికి వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా ఒక గజిటెడ్ ఆఫీసర్ కు స్టాచ్యూటరీ మెటీరియల్ అప్పగించి వెళ్ళాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి పోలైన బాలెట్స్ తో పాటు, ఎన్నికల సామాగ్రి వచ్చిన తర్వాత దగ్గరలోని ఎస్టిఓలో భద్రపరిచే బాధ్యత ఎంపీడీవోదని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దామరచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వార్డులకు పోలింగ్ జరుగుతున్నదని, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నదని, ఉదయం 11 గంటల వరకు 32 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు. దామరచర్ల మండలం పెద్ద మండలం అయినందున కౌంటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పోలింగ్ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని, ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయవద్దని ఈ సందర్భంగా ఆమె స్టేజ్ టు రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు.
ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించాలని చెప్పారు. అంతకు ముందు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఎన్నికల పరిశీలకురాలు,జిల్లా కలెక్టర్లకు వివరించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తో పాటు, డిపిఓ వెంకయ్య , దామరచర్ల ప్రత్యేక అధికారి, డిసిఓ పత్యా నాయక్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్ , తదితరులు ఉన్నారు.










