District collector : ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స.. ఆశ్చర్యపోయిన.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
District collector : ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స.. ఆశ్చర్యపోయిన.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డు, తల్లుల గది, మందుల నిల్వ గది, అలన, ఆదరణ, సేవా గదిని కలెక్టర్ పరిశీలించారు.
చిన్న పిల్లల వార్డులో ఒకే మంచం పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులు చికిత్సలు పొందుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ పరిస్థితి ఉందని ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ ను ప్రశ్నించారు.
ఆస్పత్రిలోని ఓ వార్డును జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు క్యాంటీన్ కోసం తీసుకోవడంతో గది, మంచాల కొరత ఏర్పడిందని మల్లికార్జున్ కలెక్టర్ కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ గదిని తిరిగి తీసుకుని అవసరమైన మంచాలను ఏర్పాటుచేసి చిన్నపిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల బంధువులు ఆస్పత్రిలో మందులు ఇవ్వడం లేదని, తాము డబ్బులు పెట్టి బయట కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ కు తెలపగా, స్పందించిన కలెక్టర్ వెంటనే ఏ ఏ మందులు అవసరమో తనకు నివేదిక పంపించాలని తాను మందులను వీలైనంత తొందరగా తెప్పిస్తానని డాక్టర్ మల్లికార్జున్ తో చెప్పారు.
కాగా మరికొందరు తల్లిదండ్రులు చిన్న పిల్లల వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయడం లేదని, తమ పిల్లలు ఉక్కపోత తో సతమతమవుతున్నారని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే పిల్లలకు అవసరమైన చోట ఐదు ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆస్పత్రిలో తాగునీటి కొరత, మరుగుదొడ్ల సౌకర్యం సరిగ్గా లేవని రోగుల బంధువులంతా కలెక్టర్ తో మొర పెట్టుకోగా, స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిలోని అసౌకర్యంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. మున్సిపల్ ఇంజనీర్ మహేష్ ను పిలిపించి మరుగుదొడ్ల కు సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ మరమ్మతు పనులు వెంటనే చేయించాలని, అలాగే ఆస్పత్రికి మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ను ఇవ్వాలని ఆదేశించారు.
పట్టణంలోని అన్ని వార్డులతోపాటు చిన్నపిల్లల ఆసుపత్రిలోనూ కొందరు పారిశుద్ధ్య సిబ్బందిని పురమాయించి ఆస్పత్రి ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచేటట్లు మెరుగైన పారిశుద్ధ చర్యలు చేపట్టాలని సూచించారు. చివరగా ఓ డయాలసిస్ పేషంట్ వచ్చి తమకు పింఛను రావడం లేదని కలెక్టర్ కు తెలపగా వెంటనే డయాలసిస్ పేషంట్ల వివరాలు తీసుకొని అందరికీ పింఛన్లు వచ్చేటట్లు చూడాలని కలెక్టర్ అడిషనల్ డిఆర్డిఓ అంజయ్యకు సూచించారు.
అనంతరం ఆస్పత్రి బయట మున్సిపల్ మార్కెట్ యార్డ్ కు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ స్థలంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు విషయమై కలెక్టర్ అడిషనల్ డిఆర్డిఓ కు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.
LATEST UPDATE :
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!
Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!










