తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

కూలిపోయిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పరిశీలించిన మంత్రులు.. సంఘటన దురదృష్టకరం..!

కూలిపోయిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పరిశీలించిన మంత్రులు.. సంఘటన దురదృష్టకరం..!

కూలిన సైడ్ వాళ్ళను పరిశీలించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ, మనసాక్షి.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందించేందుకుద్దేశించి చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడి పోయిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లతో కలిసి సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు కు సంబంధించి సైడ్ వాల్ పడిపోయి ఇన్ టేక్ వెల్ లోకి నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించారు .

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి వెళ్లిన సమయంలో, అలాగే వర్షాభావ పరిస్థితులు, వేసవికాలంలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం ఈ ప్రాజక్ట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరానికి ఇతర మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజక్ట్ డెడ్ స్టోరేజ్ సమయంలో తాగునీటి కోసం దీని నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఉమ్మడి నల్గొండ సాగునీటితో పాటు, తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గతం లో ఎస్ఎల్బీసీని చేపట్టడం జరిగిందని ,అయితే ఎస్ ఎల్ బి సి నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ఇతర మార్గాల ద్వారా ఆయా ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, సాగునీరు అందుతున్నదని వెల్లడించారు.

2014 నుండి 2022 వరకు సుంకిశాల ప్రాజెక్టు పనులు జరగలేదని, 2022 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టుపై 875 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. భారీ వరద కారణంగా ,వరద ఒత్తిడి వల్లప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇదివరకు నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా, ఫ్లోరైడ్ మహమ్మారి పీడిత జిల్లా అని, తాగడానికి సైతం సరిగా నీరు దొరికేది కాదని, అలాంటి పరిస్థితులలో ఎస్ఎల్బీసీ ద్వారా తాగునీటిని, ఉమ్మడి నల్గొండకు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఇవ్వాలని ప్రభుత్వం ఎస్ఎల్బీసీ చేపట్టిందని, ఇది ఆషియా ఖండంలోనే ఎత్తైన సోరంగం ప్రాజెక్టు అని తెలిపారు.

ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ కి తాగునీరు వస్తున్నదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం పడిపోయిన సందర్భంలో సుంకిశాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగిందని, అయితే సుంకి శాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని ఏజన్సీ ఊహించకపోవడం, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్న ఆత్రుతతో పనులు చేయడం వల్ల సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.

సైడ్ వాల్ కూలిపోయిన సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదని, పత్రికలు, మాధ్యమాల లో వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే కమిటీ వేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని, కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సైడ్ వాల్ కూలిపోవడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రభుత్వం పై పడకున్నా ఈ వేసవికాలంలోనే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.

సంఘటన చిన్నదే అయినప్పటికీ , వరద వస్తుందన్న అంచనా లేకపోవడం, తొందరపాటు తన వల్లనే ఇలా జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడిపోయిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువ అయినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టమని అన్నారు. దీని వల్ల పనులు మరో రెండు నెలలు ఆలస్యం అవుతాయని, ఎలాంటి నష్టం జరిగిన కాంట్రాక్టర్ భరిస్తాడని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలోనే ఉందని, పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందని, జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల వ్యవధిలో ఎస్ ఎల్ బి సి పూర్తి చేసి ఉంటే హైదరాబాద్ నగరానికి తాగునీటితోపాటు, నల్గొండకు సాగునీటికి అన్నింటికీ ఉపయోగకరంగా ఉండేదని అన్నారు.

గత ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు, కాలేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినంత ప్రాధాన్యత దక్షిణ తెలంగాణ, నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఎస్ఎల్బీసీని, డిండి ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతుందని మంత్రి అన్నారు . ఈ ప్రాంత సాగు నీటి ప్రాజక్టుల విషయమై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు .

జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర జలమండలి ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి, జలమండలి డైరెక్టర్ సుదర్శన్ ,సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సి ఈ నాగేశ్వరరావు ,సుంకిశాల ప్రాజెక్టు ఏజెన్సీ సీజీఎం కిరణ్ కుమార్, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు,
పెద్దవూర తహసిల్దార్ , ఇంజనీరింగ్ అధికారులు, మెగా ప్రాజెక్టు ప్రతినిధులు,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నారు.ఈ సందర్భంగా సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు తిలకించారు.

ALSO READ : 

Nagarjunasagar : సాగర్ జలాశయానికి 3.21 లక్షల క్యూసెక్కుల వరద.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల, పర్యాటకుల జాతర.. Latest Update

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

మరిన్ని వార్తలు