లారీ బీభత్సం.. గాలిలో ఎగిరిన విద్యుత్ స్తంభాలు, నేలమట్టమైన ట్రాన్స్ఫార్మర్లు..!
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రం సమీపంలో ఒక్కసారిగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

లారీ బీభత్సం.. గాలిలో ఎగిరిన విద్యుత్ స్తంభాలు, నేలమట్టమైన ట్రాన్స్ఫార్మర్లు..!
ఆలూర్, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రం సమీపంలో గురువారం ఒక్కసారిగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, అజాగ్రత్త తోడైతే మృత్యువు ఎంత దారుణంగా పంజా విసురుతుందో కళ్ళకు కట్టినట్లు కనిపించింది. గంగా మట్టి లోడు కోసం ఆలూర్ నుండి వెల్మల్,నందిపేట్ వైపు వెళ్తున్న ఓ లారీ ఊహించని రీతిలో బీభత్సం సృష్టించింది.
ప్రమాదం జరిగిన తీరు:
200 మీటర్ల పొడవునా అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్లను, విద్యుత్ లైన్లను తాకుతూ దూసుకెళ్లింది.ఈ క్రమంలో దాదాపు 200 మీటర్ల మేర లారీ ఆగకుండా దూసుకు వెళ్ళింది.మార్గమధ్యలో ఉన్న సుమారు 10 భారీ వృక్షాలను ఢీకొంటూ,వాటిని చీల్చుకుంటూ లారీ ముందుకు సాగింది.
కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ :
లారీ వేగానికి రోడ్డు పక్కనే ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.అంతటితో ఆగకుండా నాలుగు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.విద్యుత్ తీగలు తెగి లారీపై పడుతున్నా, డ్రైవర్ లారీని ఆపలేకపోవడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది, లేని పక్షంలో భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా,సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే,ఇంతటి బీభత్సానికి కారణం డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా :
ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేస్తున్నారు.










