Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!
Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మార్చిలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ప్రవేశపెడతామని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేస్తామన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి పార్లమెంటులో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వ ప్రతినిధి బృందం ప్రధాన మంత్రిని కూడా కలుస్తామని, జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుస్తామని ఆయన తెలిపారు.
దశాబ్దాలుగా ఉన్న ఓబీసీల కోరిక నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సామాజికవేత్తలు, మేధావులు కలిసి రావాలని ఆయన పేర్కొన్నారు. కుల గణన రీ సర్వే తోపాటు శాసనసభలో బీసి రిజర్వేషన్ల అంశం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.









