Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : ఆయిల్ పామ్ పండిస్తే.. సంక్రాంతి నాటికి జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ, జిల్లా కలెక్టర్..!

Nalgonda : ఆయిల్ పామ్ పండిస్తే.. సంక్రాంతి నాటికి జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ, జిల్లా కలెక్టర్..!

నల్లగొండ, మనసాక్షి ;

నవంబర్ 10 లోపు ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తన పరిధిలో కనీసం 150 ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు రైతులను గుర్తించి డీడీలు చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయావరణంలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో ఆయిల్ పామ్ తోటల పెంపకం పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన అధికారులు, మైక్రో ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు, పతంజలి ఫుడ్ ఫీల్డ్ స్టాఫ్ హాజరైన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటలను పెంచడం రైతులకు ఒక మంచి అవకాశం అని, ఈ పంటలు వేసిన రైతులు ఎట్టి పరిస్థితులలో నష్టపోయేది ఉండదని, అలాగే ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం సులభమని, పంట వచ్చిన తర్వాత కొంటారో లేదో అన్న అనుమానం అవసరం లేదని, ప్రభుత్వం ముందే ఆయిల్ పామ్ తోటలు పండించిన రైతులతో ఒప్పందం కుదుర్చుకొని , ధరను సైతం ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.

ఇదివరకే నల్గొండ జిల్లాలో 10,000 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలను పండించడం జరుగుతున్నదని, వ్యవసాయ విస్థరనాధికారులు, రైతులు మరి కొంచెం కష్టపడి మరో 15000 ఎకరాలలో ఆయిల్ పామ్ పండిస్తే సంక్రాంతి నాటికి జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ ఎక్కడ పెట్టాలో ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. అందువల్ల వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలో కనీసం 150 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు పెంచేందుకు నవంబర్ 10లోగా గుర్తించడమే కాకుండా, రైతుల ద్వారా డిడీలు చెల్లించేలా చూడాలని అన్నారు.

వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కొంచెం మందగించిందని, ఈ నెల 26 తర్వాత ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా సన్నధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను నిజమైన రైతులకే అందే విధంగా చర్యలు తీసుకోవాలని, జనవరి 1 నుండి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

అందువల్ల సన్నధాన్యాలకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందులో వెరైటీల వారిగా సన్నధాన్యాన్ని కొనాలని చెప్పారు. ధాన్యం అమ్మిన రైతులకు , పత్తి రైతులకు తక్షణమే వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

రుణమాఫీ విషయంలో వ్యవసాయ అధికారులు బాగా పనిచేయడం పట్ల ఆయన అభినందిస్తూ ఇంకా రుణమాఫీ కావలసిన రైతులకు రుణ మాఫీ అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలని ఆన్నారు. ఈ విషయంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ట్రైనర్ సుబ్బారావు హాజరయ్యారు.

( Reporting : Shekar, Nalgonda )

MOST READ : 

మరిన్ని వార్తలు