Karimnagar : కాళేశ్వరం నీటితో ఎల్.ఎం.డి ని నింపాలి..!
కేవలం కేసీఆర్ కు పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, త్రాగునీటిని అందించడం లేదని మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు.

Karimnagar : కాళేశ్వరం నీటితో ఎల్.ఎం.డి ని నింపాలి..!
కరీంనగర్, మనసాక్షి :
కేవలం కేసీఆర్ కు పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగునీటిని, త్రాగునీటిని అందించడం లేదని మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. ఎల్.ఎం.డి జలాశయం అడుగంటడంతో.. కరీంనగర్ నగర ప్రజలకు, హుజురాబాద్ మానకొండూరు నియోజకవర్గం రైతులకు సాగునీరుకు ఇబ్బందులు మొదలైన దృష్ట్యా.. శనివారం నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్ఎండిలో వినూత్న కార్యక్రమంతో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి అడుగంటిన జలాశయంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ రెండు దశాబ్దాల చరిత్రలో జూలై మాసంలో ఎల్.ఎం.డి నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్ కి పడిపోవడం ఇదే మొదటిసారి అని, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందకుండా పోతుందన్నారు.
మేడిగడ్డను మరమ్మత్తు చేయకపోవడం ద్వారా ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని నిల్వ చేసి మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి లకు తరలించి ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి.. వరద కాల ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండి లను నీటితో నింపాలన్నారు. అదేవిధంగా మిడ్ మానేరు పై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా కొత్తపెళ్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్పూర్, శ్రీరాములపల్లి , కాజీపూర్ గ్రామ చెరువులు నింపాలన్నారు.
ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లి లో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. బేషాజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్ఎండిలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం లేదన్నారు. మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా ఉంటుందని కేవలం రెండు టీఎంసీల నీటి ద్వారా కరీంనగర్ ప్రజలకు త్రాగునీరు అందించలేమన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో.. ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటు త్రాగునీరుకు కరీంనగర్ ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని, ఎల్ఎండి మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంటున్నా మానకొండూరు హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. మా ప్రభుత్వ హయాంలో కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్ మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి తద్వారా చెరువులకు నీరును తరలించి మత్తుడులు దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎల్ఎండిలో ఎప్పుడు 10:30 టీఎంసీలు నిలువ ఉండేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి మిడ్ మానేరు ఎల్.ఎం.డి లను నింపాలన్నారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడాతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బారాస కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు,మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










