Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన.. గొర్రెల కాపరి తో పాటు 136 గొర్రెలు మృతి..!
డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారు జామున విషాదకర ఘటన చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి తో పాటు 136 గొర్రెలు మృతి చెందాయి .

Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన.. గొర్రెల కాపరి తో పాటు 136 గొర్రెలు మృతి..!
చింతపల్లి, మన సాక్షి :
డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారు జామున విషాదకర ఘటన చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి తో పాటు 136 గొర్రెలు మృతి చెందాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన “గొర్ల కాపరి ఎల్లయ్యతో పాటు 136 గొర్రెలు మృతి” చెందడం చాలా బాధాకరమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన విషయం తెలుసుకున్న దేవరకొండ
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ , ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య , గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత-తిరుపతయ్య కార్పొరేషన్ డైరెక్టర్ క్యామ మల్లేష్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల స్వస్థల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడు ఎల్లయ్య మృతదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సహాయంగా యాదవ సంఘం తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ, గొర్ల కాపరులు తమ జీవనాధారమైన గొర్రెలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, తద్వారా ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆర్థిక భద్రత లభిస్తుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, యాదవ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









