రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు
రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు
– సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి
చౌటుప్పల్, మన సాక్షి :
వరి కోతలు పూర్తి అయ్యాక జీలుగు విత్తనాలను పొలంలో చల్లి 35 రోజుల తర్వాత భూమిలో కలిసి పోయేటట్లు భూమిని కలియ దునితే భూసారం పెరుగుతుందని చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రైతులకు జీలుగు విత్తనాలను సబ్సిడీపై సింగిల్ విండో చైర్మన్ ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిలుగు విత్తనాల వాడకం వల్ల భూసారం పెరిగి ఎరువుల వినియోగం తగ్గుతుందని, పొలానికి బలం చేకూరుతుందని పంట దిగుబడి బాగా పెరుగుతుందని అన్నారు. జీలుగు విత్తనాలు గల 30 కేజీల బ్యాగ్ సబ్సిడీ పోను 843 రూపాయలు చెల్లించి రైతులు లబ్ధి పొందాలని అన్నారు.
రైతులు జీలుగు విత్తనాలను పొందటానికి వ్యవసాయ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తో వచ్చి స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో పొందాలని కోరారు. రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, కార్యదర్శి వై రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.









