తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Komatireddy Venkatreddy : పది రోజులలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్లు.. మంత్రి కోమటిరెడ్డి..!

Komatireddy Venkatreddy : పది రోజులలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్లు.. మంత్రి కోమటిరెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

రాబోయే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టులో నీళ్లు నింపనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే కాలువల ద్వారా చెరువులు నింపేందుకుగాను ప్రభుత్వం ద్వారా కాలువల కోసం నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. సోమవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ గ్రామీణ మండలం ఖాజీరామారంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.. అంతేకాక గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ఖాజీరామారం గ్రామానికి బిటి రహదారి వేయించానని ,సబ్ స్టేషన్ నిర్మించామని ,ఇటీవల డి-39 కాలువ ను ప్రత్యేకంగా మిషన్లు ఏర్పాటు చేసి శుభ్రం చేయించినట్లు చెప్పారు.

ఖాజీరామారం గ్రామంలో గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా కట్టలేదని మంత్రి పేర్కొంటూ, ఖాజీరామారం గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్కటి 5 లక్షలు రూపాయలతో నిర్మించడం జరుగుతుందని, తన నియోజకవర్గానికి 4000 ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు.ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి మరో 20 లక్షల రూపాయలను తన ఎమ్మెల్యే నిధులనుండి మంజూరు చేస్తున్నానని,పై అంతస్తు నిర్మాణం చేయిస్తామని, ఇందులో స్వయం సహాయక మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

త్వరలోనే స్వయం సహాయక మహిళా సంఘా లకు రుణాలు సైతం ఇవనున్నట్లు మంత్రి వెల్లడించారు.గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ముట్టుకోలేదని, తాము ఆధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేసామని, 24 నెలల్లో ఎస్ఎల్ బిసీ సోరంగాన్ని పూర్తి చేయాలని తమ లక్ష్యం అని మంత్రి తెలిపారు.

పది, పదిహేను రోజుల్లో బ్రాహ్మణ వెల్లేములలో నీరు నింపుతామని, కాలువల కోసం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. ఖాజీరామారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం భూమి చదును కోసం అవసరమైతే 5 నుండి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. ఖాజీరామారం రహదారికి మరో కోట్ బీటీ వేయిస్తామన్నారు.

కోటి రూపాయలతో పావురాల గూడెం కు రహదారి మంజూరు చేయడం జరిగిందని, పంచాయతీ రాజ్ రోడ్లకు పంచాయతీరాజ్ మంత్రి తో మాట్లాడి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఖాజీ రామారం పాఠశాలకు నెలరోజుల్లో మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఖాజీరామారం పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామానికి అంబేద్కర్ విగ్రహాన్ని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామ మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా మాట్లాడుతూ గ్రామానికి రోడ్డుతో పాటు, ఎస్ సి కమ్యూనిటీ హాల్, మంజూరు చేయాలని ,గ్రామం లోని ఇళ్ళపై 11 కేవీ సబ్ స్టేషన్ వైర్లు పోతున్నందున వాటిని మార్చాలని ,విద్యుత్తు బ్రేకర్ మంజూరు చేయాలని కోరారు.

నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఆర్ అండ్ బీ ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు ,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు ,ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు