మిర్యాలగూడ : ఐకెపి కేంద్రంలో ధాన్యం తడిసి.. మొలకలు..!
మిర్యాలగూడ : ఐకెపి కేంద్రంలో ధాన్యం తడిసి.. మొలకలు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
ఆరుగాలం శ్రమించి పండించిన దాన్యం అమ్మకానికి నోచుకోక రైతన్న ఆగమాగం అవుతున్నాడు. మరో వైపు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన దాన్యం బస్తాలు తరలించడానికి లారీలు రాకపోవడంతో నెలల తరబడి దాన్యం రాసులు కల్లాల వద్దే వుంటున్నాయి. ఇంకో వైపు ఆకాశంలో గత రెండు రోజుల నుండి మబ్బులు పడుతుండడం రైతన్నను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆడపడదప పడుతున్న చినుకులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పండిన దాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్న అధికారులు, పాలకుల హామీ అమలుకు నోచుకోవడం లేదు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని త్రిపురారం మండలం లచ్యతండ గ్రామ పంచాయతీలో నెల రోజులకు పైగా దాన్యం అమ్మకానికి వచ్చి ఐకేపీ కేంద్రంలో రాసులుగా పడివున్నా చూసే దిక్కు లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న ఆకాశం వైపు చూస్తున్నారు. లచ్యతండాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 15000 బస్టాల వరకు దాన్యం రాసులు ఉండగా 2000 బస్టాల కాంట వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రాక కేంద్రంలోనే పడివున్నాయి.
మరో వైపు కాంటాలు వేసిన దాన్యం గత మూడు రోజుల క్రితం తడవడంతో మొలకలు వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం దాన్యం కాంటాలు వేసి తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో రైతులు భారి మొత్తంలో నష్ట పోయే ప్రమాదం వున్నది.











