Breaking Newstravelతెలంగాణ

కండక్టర్ తొలగింపు వివాదం.. సజ్జనార్ క్లారిటీ.. అందుకే శాఖ పరమైన చర్యలు..!

కండక్టర్ తొలగింపు వివాదం.. సజ్జనార్ క్లారిటీ.. అందుకే శాఖ పరమైన చర్యలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

జ‌న‌గామ డిపోన‌కు చెందిన ఒక కండ‌క్ట‌ర్‌ను అకార‌ణంగా విధుల నుంచి త‌ప్పించార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదు. ఇది పూర్తి అవాస్త‌వం. అని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ఈ నెల 1వ తేదిన ఒక మ‌హిళ, త‌న త‌ల్లి, ఏడాది కుమారుడితో క‌లిసి హ‌న్మ‌కొండ నుంచి హైద‌రాబాద్‌కు జ‌న‌గామ డిపోన‌కు చెందిన బ‌స్సు ఎక్కారు. వీరంతా మొద‌టి వ‌ర‌స‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో కూర్చున్నారు. ఆ స‌మ‌యంలో ఆ సీట్ల‌ను ఖాళీ చేయాలంటూ కండ‌క్ట‌ర్ శంక‌ర్ వారితో అమ‌ర్యాద‌గా, దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. లేకుంటే బ‌స్సు దిగి వెళ్లిపోవాలని చెప్పారు. త‌న అమ్మ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పిన విన‌కుండా.. ముగ్గురిని మ‌డికొండ వ‌ద్ద బ‌స్సులోంచి దింపేశారు.

ఈ విష‌యాన్ని బాధిత మ‌హిళా ప్ర‌యాణికురాలి భ‌ర్త సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(ట్విట్ట‌ర్) ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం దృష్టికి తీసుకువ‌చ్చారు. అందుకు సంబంధించిన వివ‌రాల‌తో పాటు బ‌స్సు, డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై యాజ‌మాన్యం విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ ఆదేశాల‌తో ఆర్టీసీ వ‌రంగ‌ల్ రీజియ‌న్ అధికారులు విచార‌ణ జ‌రిపారు.

ఈ విచార‌ణ‌లో మ‌హిళా ప్ర‌యాణికురాలి ప‌ట్ల దురుసుగా, అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించడం, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మార్గ‌మ‌ధ్యంలో బ‌స్సులోంచి వారిని దించిన‌ట్లు తేల‌డంతో కండ‌క్ట‌ర్ శంక‌ర్‌ను విధుల నుంచి త‌ప్పించ‌డం జ‌రిగింది. టీజీఎస్ఆర్టీసీ నియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కే కండ‌క్ట‌ర్‌పై శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను సంస్థ తీసుకుంది.

గ‌తంలోనూ శంక‌ర్‌పై ఇలాంటి ఫిర్యాదులే వ‌చ్చాయి. దీంతో రెండు సార్లు సస్పెండ్ చేయడంతో  పాటు ఒక సారి ఆయనను విధుల నుంచి తొలగించడం(రిమూవ్) జరిగింది. అంతేకాదు, అధికారుల‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా వేర్వేరుగా ఐదు సార్లు మూడున్నరేళ్ల పాటు విధుల‌కు గైర్హాజ‌రు అయ్యారు. మొత్తంగా 12 సార్లు శంక‌ర్‌పై ఫిర్యాదులు వ‌చ్చాయి. అయినా  మాన‌వ‌త దృక్ఫ‌థంతో సంస్థ ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. తాజాగా మ‌ళ్లీ ఫిర్యాదు రావ‌డంతో విచార‌ణ జ‌రిపి గ‌తంలో మాదిరిగానే శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను సంస్థ తీసుకుంది.

టీజీఎస్ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు. ప్ర‌యాణికుల‌కు మెరుగైన, నాణ్య‌మైన  ర‌వాణా సేవ‌లందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబ‌ద్ద‌త, అంకిత‌భావంతో ప‌నిచేస్తున్నారు. 45 వేల ఆర్టీసీ సిబ్బంది క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌తి రోజు స‌గ‌టున 55 ల‌క్ష‌ల మందిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తున్నారు. విధి నిర్వహణలో సేవాతర్పరత చాటుతున్న సిబ్బందిని ఎక్స్ట్రా మైల్ కార్యక్రమం ద్వారా సంస్థ సత్కరిస్తోంది.

ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సంస్థ సీరియస్ గా తీసుకుంటోంది.  వాటిని వీలైనంత త్వరగా విచారణ జరుపుతోంది. ఫిర్యాదుల విష‌యంలో నిబంధ‌న‌ల ప్ర‌కారమే యాజమాన్యం న‌డుచుకుంటోంది. అన్ని కోణాల్లో స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటుంది.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

 

Nagarjunasagar : రెండేళ్ల తర్వాత నిండిన సాగర్.. 22 గేట్ల ద్వారా నీటి విడుదల, కొనసాగుతున్న వరద.. Latest Update

 

మరిన్ని వార్తలు