Singareni : సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ చెల్లింపు..!

Singareni : సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ చెల్లింపు..!
రామగిరి, (మన సాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ ను వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. అమెరికా నుంచి వీసీ ద్వారా సంస్థ సీ అండ్ఎం డీ ఎన్.బలరామ్ మంగళవారం ఉదయం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రివర్గ సభ్యులు, సింగరేణి సంస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో 33 శాతాన్ని అనగా 796 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్ గా ప్రకటించారు. సింగరేణి చరిత్ర లో ఇది అత్యధికం కావడం విశేషం.
సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తాము పనిచేసిన పని దినాల సంఖ్య ను పరిగణనలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు సుమారు లక్షా తొంభై వేల రూపాయల చొప్పున లాభాల వాటా బోనస్ ను పొందే అవకాశం ఉంది.
తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా…
సింగరేణి లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లాభాల వాటా బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఆదేశించారు.
ముఖ్యంగా ఆర్థిక సంవత్సరంలో వివిధ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసిన వారి వివరాలు, వారి సమాచారాన్ని పూర్తిగా సేకరించాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ నెల జీతంతో పండుగ అడ్వాన్సు-ఒక్కొక్కరికి రూ.25 వేలు
లాభాల వాటా బోనస్ తో పాటు సింగరేణి సంస్థ ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా దసరా పండుగ అడ్వాన్స్ ను సింగరేణి ఉద్యోగులకు చెల్లించాలని సీఎండీ ఆదేశించారు.
ఒక్కొక్కరికి 25 వేల రూపాయల పండుగ అడ్వాన్స్ ను చెల్లించనున్నారు. దీని కోసం సంస్థ 95 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. సెప్టెంబరు నెల జీతాలతోపాటే ఈ పండుగ అడ్వాన్స్ సొమ్మును కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
లాభాల వాటా బోనస్ మరియు పండుగ అడ్వాన్సులు కలిపి దాదాపు 900 కోట్ల రూపాయలను సింగరేణి ఉద్యోగులకు చెల్లించనున్న నేపథ్యం లో సింగరేణి సిబ్బంది వ్యవహారాలు, ఆర్థిక విభాగాలు తగు ఏర్పాట్లు చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.
MOST READ :
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూ..!
-
District collector : వారం రోజుల్లో మార్పు రావాలి, లేదంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
-
KTR : అనుముల తిరుపతిరెడ్డి గారూ.. సామాన్యులకు ఆ.. కిటుకేదో చెప్పండి.. కేటీఆర్ ట్వీట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!









