Narayanpet : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
జిల్లా పోలీసు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే క్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Narayanpet : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
జిల్లా పోలీసు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే క్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని అన్ని విభాగాలను పరిశీలించి రికార్డులు, పెండింగ్ పిటిషన్లు, విచారణల పురోగతి, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా స్టేషన్లో నమోదైన ప్రతి పిటిషన్ను వెంటనే ఎంట్రీ చేసి, నిర్దిష్ట సమయంలో విచారణ పూర్తి చేసి ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రతి రోజు జనరల్ డైరీ తప్పనిసరిగా నమోదు చేయాలని, రోజు వారి విధుల వివరాలు క్రమబద్ధంగా నమోదు చేయాలని ఆదేశించారు. బయటి విధులకు వెళ్లే ప్రతి పోలీసు సిబ్బందికి సంబంధిత డ్యూటీ పాస్/అధికార అనుమతి పత్రం జారీ చేసి, వారి రాకపోకల వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అన్ని కేసులను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ఆన్లైన్ పోర్టల్లో సకాలంలో నమోదు చేయాలని, ఎలాంటి కేసు ఎంట్రీ పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసు సమాచారాన్ని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి నవీకరించాలని ఆదేశించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, స్టేషన్ పరిధిలో 24 గంటల పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సామాజిక అంశాలపై సైబర్ నేరాలు, నేరాల నివారణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, రాత్రి వేళల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
స్టేషన్లోని అన్ని రికార్డులు, రిజిస్టర్లు, కేసు వివరాలు పూర్తిస్థాయిలో, ఎలాంటి లోపాలు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మరింత త్వరితగతిన న్యాయం అందించేందుకు అవసరమైన చోట ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి వారి ఫిర్యాదుకు సంబంధించిన రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని, కేసు నమోదు చేసిన అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లుతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









