అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలదే..!
దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలందరి బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలదే..!
చింతపల్లి, మనసాక్షి :
దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలందరి బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు. బుధవారం చింతపల్లి మండలం పరిధిలోని గొడకొండ్ల, సాయి రెడ్డిగూడెం, కురంపల్లి, చింతపల్లి,గ్రామ పంచాయతీలో ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్” సర్ ప్రక్రియను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సర్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయిందో బిఎల్ వో లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అర్హులైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి గ్రామం, ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, అర్హులైన వ్యక్తి ఓటు జాబితాలో పేరు లేకపోతే ఎన్నికల్లో ఓటు వేయలేక పోవడంతో పాటు, భవిష్యత్తులో ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. అందువల్ల ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీఎల్ఏ, కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన చోట కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలు జరిగేలా ప్రజలకు సహకరించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని, ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు, గిరిజనులు, దూర ప్రాంత ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం… ప్రతి ఓటును కాపాడుకోవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క అర్హులైన ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలి” అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పిలుపునిచ్చారు. ఆగస్టు 3 వ తేదీ వరకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి సర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో, గొడకొండ్ల సర్పంచ్ కాష గోని వెంకటయ్య, సాయి రెడ్డిగూడెం సర్పంచ్ గండేటి వెంకటయ్య, కురం పల్లి సర్పంచ్ కట్ట మహేష్ తాసిల్దార్ విజయలక్ష్మి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కొండూర్ భవాని పవన్ కుమార్, అంగిరేకుల గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జటావత్ హరినాయక్, మాజీ జెడ్పిటిసి జంగిటి నరసింహ యాదవ్, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, జిల్లా కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్ ముచ్చర్ల యాదగిరి, గుండ్లపల్లి నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, బిఎల్వోలు, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









