Miryalaguda : అడుగుకో గుంట.. ప్రయాణం ఓ నరకం.. రైతుల వెన్నులో వణుకు..!
అడుగుకో గుంత... కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అద్వాన దారితో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Miryalaguda : అడుగుకో గుంట.. ప్రయాణం ఓ నరకం.. రైతుల వెన్నులో వణుకు..!
అవస్థలు పడుతున్న రైతులు, వాహనాదారులు
గుంతలతో అధ్వానంగా కాల్వ కట్ట దారి
పట్టించుకోని అధికారులు
అనేకసార్లు బోల్తాపడ్డ వడ్ల లోడు ట్రాక్టర్లు
మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:
అడుగుకో గుంత… కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అద్వాన దారితో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతున్నాయి. ఈ దారిపై నీళ్లు నిలిచి ఎక్కడ గుంట ఉందో తెలియక రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామ శివారులో గల సాగర్ ఎడమ కాలువ కట్టపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయని రైతులు వాపోతున్నారు. ఈ దారి పొడవునా ప్రమాదకరమైన గుంటలు ఏర్పడ్డాయి. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంతో పాటు పలు గ్రామాల రైతులు కూడా ఈ దారి వెంట ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు ఈ దారి గుండా ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుడుతుందని వాపోయారు.
ఈ ఎడమ కాలువ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రావులపెంట, కామేపల్లిగూడెం, దోసపాడు, నాగులపాడు అన్నారం, తడకమల్ల తదితర గ్రామాల్లోని ప్రజలు, రైతులు ఈ పెద్ద కాలువ కట్ట పై నుండి ప్రయాణం చేశారు. గతంలో వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి అందులోని వడ్లన్నీ నీటిపాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. గుంతల పై అధికారులకు ఎలాంటి పట్టింపు లేకుంటా పోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం మరమ్మత్తులు కూడా చేయడం లేదని, దారి అద్వానంగా మారిన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిని గుంతలు సైతం పరిశీలించడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.










