Miryalaguda : యూరియా యాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. రేపటి నుంచి బుకింగ్, టైమింగ్స్ ఇవే..!
రైతులకు యూరియా ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా చేయాలనే ఉద్దేశ్యంతో యూరియా బుకింగ్ యాప్ను రూపొందించినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Miryalaguda : యూరియా యాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. రేపటి నుంచి బుకింగ్, టైమింగ్స్ ఇవే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులకు యూరియా ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా చేయాలనే ఉద్దేశ్యంతో
యూరియా బుకింగ్ యాప్ను రూపొందించినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి యూరియా యాప్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగిస్తూ పలు సంస్కరణలు తీసుకువస్తోందని తెలిపారు.
యూరియా కోసం రైతులు అనవసర ఇబ్బందులు పడకుండా, సమయానికి ఎరువులు అందేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
యూరియా స్టాక్ పూర్తయ్యే వరకు బుకింగ్ ప్రక్రియ ఓపెన్లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
అలాగే రేపటి నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు మరోసారి యాప్లో బుకింగ్లు ఓపెన్ అవుతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన మేరకు యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు, సరఫరా ప్రక్రియ వేగవంతమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










