Suryapet : సూర్యాపేట జిల్లాలో చిన్నారులను హింసించిన తల్లిదండ్రులు.. అరెస్ట్, రిమాండ్..!
హుజూర్నగర్ పట్టణంలో చిన్నారులను వేధించిన, చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో తల్లిదండ్రుల ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు వెల్లడించారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో చిన్నారులను హింసించిన తల్లిదండ్రులు.. అరెస్ట్, రిమాండ్..!
హుజూర్నగర్, మన సాక్షి:
హుజూర్నగర్ పట్టణంలో చిన్నారులను వేధించిన, చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో తల్లిదండ్రుల ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు వెల్లడించారు. చిన్నారులను చిత్రహింసలు పెట్టడం పై స్థానిక ఇరుగుపొరుగు వారు డయల్ 100 ద్వారా పోలీసు వారికి సంచారం ఇవ్వగా వెంటనే స్పందించిన హుజూర్నగర్ పోలీసులు చిన్నారులను రక్షించిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు.
సిఐ చరమంద రాజు మాట్లాడుతూ.. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి రవి (46, లారీ డ్రైవర్) అనే వ్యక్తికి గతంలో గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను వదిలేశాడు. మూడవ భార్యగా ఇందు అలియాస్ అఖిల (కూలీ పని) అనే మహిళను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.ఇందుకి ఇదివరకే దేశబోయిన కిరణ్తో వివాహమై ధనుష్ (5) అనే కుమారుడు ఉన్నాడు. రవితో వివాహం తర్వాత వీరికి హేమంత్ (2 సం) అనే బాబు జన్మించాడు. ప్రస్తుతం వీరంతా హుజూర్నగర్లోని ఎన్ఎస్పి క్యాంపులో నివాసం ఉంటున్నారు.
తమ విలాసాలకు, స్వేచ్ఛకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారనే నెపంతో రవి, ఇందు కలిసి పిల్లలను నిరంతరం వేధించేవారు. కర్రలతో విపరీతంగా కొట్టడమే కాకుండా, ఇనుప ఊదుడు గొట్టాన్ని పొయ్యిలో కాల్చి చిన్నారుల శరీరాలపై వాతలు పెట్టారు. ఈ క్రూరమైన హింసను తట్టుకోలేక పిల్లలు ఎంత ఏడ్చినా కనికరం లేకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఈ దాడిలో రెండేళ్ల చిన్నారి హేమంత్ కుడిచేయి మణికట్టు కూడా విరిగింది. పిల్లల ఆర్తనాదాలు విన్న స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే హుజూర్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా, ఐసీడీఎస్ ఇన్చార్జ్ నిర్మల ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు హుజూర్నగర్ ఎస్ఐ నరేశ్ కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం వారి రక్షణ మరియు సంరక్షణ నిమిత్తం సూర్యాపేటలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (బాల రక్షక భవన్) వారికి పిల్లలను సురక్షితంగా అప్పగించారు.
హుజూర్నగర్ పోలీసులు నిందితులైన రవి, ఇందులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చిన్నారులను హింసించడానికి ఉపయోగించిన ఇనుప ఊదుడు గొట్టం, కర్రను స్వాధీనం చేసుకుని, నిందితులను న్యాయస్థానం ముందు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచారు.









