దేశీయ కమోడిటీ మార్కెట్ల అభివృద్ధికి ముందడుగు.. ఎమ్సీఎక్స్, ఎన్ఐఎస్ఎం కీలక భాగస్వామ్యం!
భారతదేశ కమోడిటీ మార్కెట్లలో పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 'MCX-NISM సెంటర్ ఫర్ కమోడిటీ మార్కెట్స్' ఏర్పాటవుతోంది

భారతదేశ కమోడిటీ మార్కెట్లలో పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ‘MCX-NISM సెంటర్ ఫర్ కమోడిటీ మార్కెట్స్’ ఏర్పాటవుతోంది. ‘గ్లోబల్ కమోడిటీ కాంక్లేవ్ 2026’ వేదికగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX) , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) సంస్థలు ఈ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కోసం అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కేంద్రం ప్రధాన లక్ష్యాలు , ప్రత్యేకతలు:
ఎన్ఐఎస్ఎం ప్రాంగణంలో రూపుదిద్దుకోనున్న ఈ వేదిక ద్వారా, ఎమ్సీఎక్స్ పరిశ్రమ అనుభవం , ఎన్ఐఎస్ఎం విద్యాపరమైన మౌలిక వసతులు ఒకేచోట కలిసి పనిచేస్తాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా దేశీయ కమోడిటీ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లతో పోటీపడేలా తగిన నైపుణ్యాలను అందించడంపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టనుంది.
సామర్థ్యాల పెంపు, వృత్తిపరమైన అభివృద్ధి, అప్లైడ్ రీసెర్చ్ , మదుపర్లలో అవగాహన కల్పించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.
శిక్షణా కార్యక్రమాలు , పరిశోధన:
కమోడిటీ డెరివేటివ్స్ తీరుతెన్నులపై అవగాహన కల్పించడంతో పాటు, మార్కెట్ నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తారు.
హెడ్జింగ్, కార్పొరేట్ రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లయెన్స్ , నైతిక విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన పాలసీ పేపర్లను రూపొందిస్తారు.
ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు, డాక్టోరల్ ఫెలోషిప్లు , అకడమిక్ సింపోజియంల ద్వారా నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దనున్నారు.
ఈ కేంద్రం ఏర్పాటులో ఎమ్సీఎక్స్ తన డొమైన్ నైపుణ్యాన్ని వినియోగించి కంటెంట్ అభివృద్ధి, బోధనా రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుంది. దీనివల్ల మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పటిష్టమైన అభ్యాస కార్యక్రమాలను అందించడానికి మార్గం సుగమమవుతుంది.








