Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

TG News : భూ భారతి ఫైలెట్ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..!

TG News : భూ భారతి ఫైలెట్ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు సూచించారు. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు అవసరమైన పనులను కొనసాగించి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ద్వారా ఏ ప్రాంతమైన, జిల్లా, రాష్ట్రమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లా పర్యటనకు తొలిసారిగా వచ్చిన సీ.ఎస్.

గురువారం ఇక్కడి కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. సమీక్షలో సీ ఎస్ మాట్లాడుతూ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సమయంలో నెలకు 6 వేల కోట్ల ఖర్చు అయ్యేదని, ఇప్పుడా ఖర్చు 23 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. జిల్లాలు పెరిగాయని, ప్రజల అంచనాలు కూడా పెరిగాయని, అన్నింటిని బ్యాలెన్స్ చేయాలన్నారు.

నారాయణ పేట జిల్లా చివర్లో వచ్చిందని, సీఎం జిల్లా కావడం కలిసి వస్తుందని, జిల్లాకు చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అభివృద్ధి కంటికి కనబడాలి అన్నారు. 3.50 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 3.50 లక్షల మంది అంటే జనాభాలో ఒక శాతమే ప్రభుత్వ అధికారులం ఉన్నామని, ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. చిన్న జిల్లా కావడం, అందులో సీఎం జిల్లాగా ఉండటంతో అభివృద్ధి పనులు వేగవంతం చేసే అవకాశం ఉంటుందన్నారు.

భూ భారతి చట్టం ఎంతో సులభ తరమైనది. రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు ఫైలెట్ మండలాలలో జిల్లాలోని మద్దూరు మండలం కూడా ఒకటి. ఈ పైలెట్ మండలంలో భూ సమస్యలకు చూపించిన పరిష్కారం అన్ని మండలాలకు వర్తిస్తుందని, ఇక్కడ నేర్చుకున్న పాఠాలే రాష్ట్రమంతా అమలు చేస్తారన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే పరిష్కారం కానిది అని నిర్ధారించి తిరస్కరించాలని సీ ఎస్ సూచించారు.

చట్టం ప్రకారం ఏది చేస్తారో, ఏది చేయరో రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. చట్టాన్ని జాగ్రత్తగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. నిధుల సమస్య ఏమీ లేదని, అనర్హులను ఎంపిక చేయవద్దన్నారు. (ఐ డీ ఓ సీ) జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియ ను వేగిరం చేయాలన్నారు.

ఆ పథకం ద్వారా మక్తల్, నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. జిల్లాలో రబీ, ఖరీఫ్ వరి సాగు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వరితో పాటు జిల్లాలో తిన దగిన నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ సీ ఎస్ కు తెలిపారు. జిల్లాలో పదో తరగతి ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని డీ ఇ ఓ గోవిందరాజులు తెలపగా సీ ఎస్ స్పందిస్తూ ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఎఫ్ ఎల్ ఎన్ మంచి కార్యక్రమం అని కానీ విన్నది పిల్లలకు అర్థం అవుతుందో లేదో తెలుసుకోవాలన్నారు. అవసరమైతే పిల్లల ఇంటికి వెళ్ళి వారి విద్యా నైపుణ్యాన్ని పరిశీలించాలన్నారు. చదవడానికి నేర్చుకోవాలని, నేర్చుకోవడానికి చదవాలని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీ, రాజస్తాన్ పాఠశాలలో విద్యా బోధనను పరిశీలిస్తే మనం ఏంచేయాలో తెలుస్తుందన్నారు. పిల్లలు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి లో పాఠాలు చెప్పాలని ఆయన తెలిపారు.

కడ అభివృద్ది పనులపై శాఖల వారీగా చర్చించి వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇంకా సమీక్షలో సన్న బియ్యం పథకం, రాజీవ్ యువ వికాసం, ప్రజారోగ్యం, మిషన్ భగీరథ, టి జీ ఈ డబ్ల్యూ ఐ డి సి, పోలీసు శాఖ ల ప్రగతి పనుల పురోగతికి సీ ఎస్ సలహాలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు ఆయా శాఖల నివేదికలతో కూడిన వివరాలను సీ ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటెన్ ద్వారా అధికారులు వివరించారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

  1. TCS: టీసీఎస్ ఘనత.. ప్రపంచంలోని టాప్-50 బ్రాండ్స్‌లో ఒకటిగా గుర్తింపు..!

  2. Rythu : అంతర పంటగా కోకో.. రైతులకు అదనపు ఆదాయం..!

  3. Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

  4. District collector : నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్..!

  5. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

  6. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు