District Collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం దిగుమతి తీసుకోవాలి..!
శుక్రవారం కలెక్టర్ బి చంద్రశేఖర్ తన ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, ధాన్యం సేకరణ కు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు

District Collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం దిగుమతి తీసుకోవాలి..!
నలగొండ, మన సాక్షి :
- శుక్రవారం కలెక్టర్ బి చంద్రశేఖర్ తన ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, ధాన్యం సేకరణ కు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రబీ ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నందున రైస్ మిల్లర్లు జాప్యం చేయకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే అన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు.
వివిధ కారణాలతో మిల్లుల వద్ద లారీలు అన్లోడ్ కాకుండా నిలిచిపోకూడదన్నారు.
రబీ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడి వారికున్న పూర్తి సామర్థ్యంతో వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు అన్లోడ్ చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలలో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, మరో 15 రోజుల్లో మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున మిల్లర్లు పూర్తి సామర్థ్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాలు, లారీలు తదితర కారణాలతో ఎలాంటి కొర్రీలు విధించకుండా ధాన్యాన్ని దించుకోవాలని, ఈ విషయంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటిఫైడ్ లారీలను ఏర్పాటు చేయమని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ను ఆదేశించారు.
ఈ విషయంలో మిల్లర్లతో పాటు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు పూర్తిస్థాయిలో లారీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, బ్యాంకు గ్యారెంటీ, మిల్లర్ అగ్రిమెంటు సమర్పించని మిల్లర్లు తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణలో ఎట్టి పరిస్థితులలో రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తడవకుండా, పాడవకుండా ముందుగానే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం లోడింగ్ లో ఒకే వెరైటీని మాత్రమే లోడ్ చేసి పంపించాలని, “ఏ” గ్రేడ్ ధాన్యంతో కామన్ వెరైటీలు కలిపి పంపించకూడదని చెప్పారు. ఇప్పటివరకు ఆయా మిల్లుల వారిగా దిగుమతి చేసుకున్న ధాన్యం వివరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని చెప్పారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, రబీ ధాన్యం సేకరణ పై మిల్లర్లకు పలు సూచనలు చేశారు. పౌరసరఫరాల జిల్లా అధికారులు వెంకటేశం, రామ్ పతి నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డి సి ఓ పత్యా నాయక్ ,జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్ ,తదితరులు ఉన్నారు.










