మిర్యాలగూడ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం, రూ. 42 లక్షలు వసూలు ..!
మిర్యాలగూడ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం, రూ. 42 లక్షలు వసూలు ..!
మిర్యాలగూడ/ వేములపల్లి , మనసాక్షి:
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసానికి పాల్పడిన సంఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఓ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాస్ నల్గొండలో పనిచేస్తున్నాడు. అతనికి తెలిసిన స్నేహితుల వద్ద, ఇతరుల వద్ద రైల్వే శాఖ, జ్యుడీషియల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు వసూలు చేశాడు.
శనివారం బాధితులు కందుల నాగిరెడ్డి , బొమ్మగాని జానకి రాములు , వీరమల్లు మహేష్ మిర్యాలగూడ డిఎస్పి ని కలిసి వివరాలు వెల్లడించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఇతను ఆ మండలం తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగుల వద్ద సుమారు 42 లక్షల రూపాయలు వసూలు చేశాడు. వారిలో కొంతమందికి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఉద్యోగాలు వచ్చాయని నమ్మబలికాడు.
కొంతమందికి రెండు మూడు నెలల పాటు వేతనాలు కూడా బ్యాంకులో జమ చేశాడు. దీనిని నమ్మిన మరికొంతమంది అతనికి డబ్బులు చెల్లించారు .వేములపల్లి మండలంలోని రావులపెంట, మొలకపట్నం, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మట్టి ఖమ్మంపాడు తో పాటు మంగాపురం గ్రామానికి చెందిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు.
అతను ఇప్పించిన ఉద్యోగాలు నకిలీవని తేలడంతో తిరిగి తమ డబ్బులు ఇవ్వాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయినా అతడు వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో శనివారం డిఎస్పిని ఆశ్రయించారు. అంతకుముందు బాధితులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమ వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










