Hyderabad : గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ.. ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!
గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు

Hyderabad : గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ.. ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ముగ్గురు నేపాల్కు చెందిన నిందితులను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారు. సందర్బంగా గురువారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సీపీ డా.రమేష్ వివరాలను వెల్లడించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో నివసిస్తున్న ఓవ్యాపారవేత్త ఇంట్లో ఈనెల 6 న నెల రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో పని కోసం చేరిన నేపాలీ జంట మరో వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడ్డారు. కాగా వ్యాపారవేత్త తన కుటుంబంతో ఢిల్లీకి వెళ్తూ లాకర్ తాళం వేసి తాళం చెవిని లాకర్ మీద ఉన్న చెంబులో పెట్టడమే నిందితులకు వరంగా మారింది. ఏకంగా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలతో పరారయ్యారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ముఠాను ఉత్తర్ఖండ్ సరిహద్దులో గచ్చిబౌలీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకున్నారు.ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను పంపించి, అనుమానితుల వివరాలు, ఫొటోలను ఆయా రాష్ట్రాల పోలీసులతో పంచుకుని వారి సహకారం తీసుకున్నారు. నేపాలీ నేర ముఠాల కదలికలపై పనిచేస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందం కూడా దర్యాప్తులో భాగస్వామ్యమైంది.
ఈ క్రమంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ పి. నరేష్ తన బృందంతో కలిసి, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా ఎస్పీ సుమేంద్ర మీనా, ఐపీఎస్, బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జీత్ సింగ్ మరియు వారి సిబ్బంది సహకారంతో రాంపూర్ జిల్లా బిలాస్పూర్ రోడ్డుపై ముగ్గురు కమల్ షాహీ (32), బాల్ బహదూర్ షాహీ కుమారుడు, కైలాలి జిల్లా, కర్ణాలి ప్రావిన్స్, నేపాల్.విమ్లా షాహీ అలియాస్ బిమలా షాహీ, కమల్ షాహీ భార్య, సుర్ఖేత్ జిల్లా, కర్ణాలి ప్రావిన్స్, నేపాల్.కల్పనా షాహీ (26), నారా బహదూర్ షాహీ కుమార్తె, కైలాలి జిల్లా, కర్ణాలి ప్రావిన్స్,లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి సుమారు 7 కిలోల 837 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 1,361 గ్రాముల వెండి వస్తువులు, నగదు రూ.33,170 , రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల దర్యాప్తులో, ఖరీదైన విల్లాలు, ఉన్నతాధికారులు నివసించే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గృహ సహాయకులుగా లేదా వారి ద్వారా ఉద్యోగాలు పొందడం, ఇంట్లో ఎవరూ లేని సమయాలపై సమాచారం సేకరించి చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.
ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ అలియాస్ సూరజ్ అనే వ్యక్తి నేపాల్ నుంచి వ్యక్తులను హైదరాబాద్కు తీసుకొచ్చి గృహ సహాయకులుగా నియమించేవాడని, కరణ్ బిశ్వకర్మ సహకారంతో హిల్ రిడ్జ్ విల్లాస్లోని విల్లా నెం.73లో కూడా వారిని నియమించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
అరెస్టు చేసిన నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి, మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన పోలీసు సిబ్బందికి నగదు బహుమతులు ప్రకటించారు.
కేసును ఛేదించిన వారిలో శేరిలింగంపల్లి డీసీపీ శ్రీ చి. శ్రీనివాస్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, అదనపు డీసీపీ ఎన్. ఉదయ్ రెడ్డి, ఏసీపీ కళింగరావు, గచ్చిబౌలి ఎస్హెచ్ఓ బాలరాజు, డీఐ నరేష్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ ,సిబ్బంది కీలక పాత్ర పోషించారు.









