District collector : వేసవిలో మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
District collector : వేసవిలో మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
నల్లగొండ, మన సాక్షి :
వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు .మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, విద్యుత్ , పారిశుద్ధ్యం, తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
వేసవికాలం ప్రారంభమైనందున ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని వార్డ్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. గత ఏడాది మంచినీటి డిమాండ్ ఆధారంగా ఈ సంవత్సరం సైతం తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు.
ఓవర్ హెడ్ ట్యాంకులు, మంచినీటి ట్యాంకులన్నింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలని తెలిపారు. నల్గొండ మున్సిపల్ శివారు కాలనీలలో సైతం తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని , ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల తాగునీటికి ఇబ్బంది ఏర్పడితే వెంటనే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వేసవిలో విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా కు ఎక్కడైన విద్యుత్ సమస్య ఉంటే తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వార్డ్ ఆఫీసర్లు లేదా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు వెంటనే మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించాలని అన్నారు.
వీధి దీపాల ద్వారా విద్యుత్ ఆదా చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన సమయంలో మాత్రమే వీధి దీపాలు వినియోగించాలని, సాధ్యమైనంతవరకు తక్కువ విద్యుత్తును వినియోగించాలని చెప్పారు. వనమహోత్సవం కింద నాటిన మొక్కలు వేసవిలో ఎండల కారణంగా చనిపోయెందుకు ఆస్కారం ఉందని, అలా కాకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా చెట్లకు నీరు పోయాలని అన్నారు.
మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా పారిశుధ్యం తదితర విషయాలలో వార్డు అధికారులు అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు సమస్య ఉన్నట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇటీవల వీఆర్వోల నుండి వార్డ్ ఆఫీసర్లు గా నియమించిన సిబ్బంది వారి పని విధానాన్ని తెలుసుకోవాలని కోరారు.
నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణ పురోగతిని ఆమె సమీక్షిస్తూ సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో శానిటేషన్ ,తడి చెత్త ,పొడి చెత్త,చెత్త సేకరణ, వర్మి కంపోస్ట్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్,ఈ ఈ రాములు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ,విద్యుత్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కోమటి రెడ్డి ప్రతీక రెడ్డి జూనియర్ కళాశాల వెనక వైపున ఉన్న అక్క చెలిమ గుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పనులను, మర్రిగూడ బై పాస్ లో ఎం ఎన్ ఆర్ గార్డెన్ శనేశ్వర గుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పనులను, మునుగోడు రోడ్డులో స్వర్గపురి హిందూపూర్ వైకుంఠ దామాన్ని పరిశీలించారు.










