Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక..!

Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మిర్యాలగూడ మండలంలో చింతపల్లి గ్రామం మాజీ సర్పంచ్ బానావత్ లలితా సక్రు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు బాణావత్ కృష్ణా నాయక్ తో పాటుగా 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలను నల్లమోతు భాస్కర్ రావు కండువాలు కప్పి బీఆర్ ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.
ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చైతన్యం కల్పించాలని భాస్కర్ రావు తెలిపారు.
కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ, మట్టపల్లి సైదయ్య యాదవ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :










