Nalgonda : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరం..!
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Nalgonda : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరం..!
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్గొండ, మనసాక్షి :
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా రైతులకు రైతు బీమా, రైతు భరోసా అలాగే 6 గ్యారంటీల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నది చెప్పారు. అయినప్పటికీ వివిధ రంగాలలో ఇంకా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రైతులు పంటల మార్పిడికి వెళ్లాలని, దేశ,కాల , వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలపై అవగాహనకల్పించుకోవాలన్నారు. రోజురోజుకు తగ్గిపోతున్న పశు సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు ఉత్పన్నం అయ్యేందుకు మనమే కారణం కావద్దని, సమస్యల పరిష్కారం పై లోతుగా ఆలోచించాలన్నారు.
విద్య, సాగునీరు ,వైద్య రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, మోడల్ పాఠశాలలు ఏర్పాటు, విద్యార్థులకు యూనిఫామ్స్ ,మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నదని, అంతేకాక రానున్న విద్యా సంవత్సరం నుండి అల్పాహారం కూడా అందించనుందని తెలిపారు.
ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని ,ఈ విషయంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. గ్రామాలలో పారిశుధ్యం కోసం ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామని, జూన్ 2 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా పలు కార్యక్రమాలు. చేయాల్సి ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళినట్టు చెప్పారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ప్రజల కార్యక్రమాలతో అంకితమైన కార్యక్రమం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను, త్వరలో అమలు చేయనున్న కొత్త పథకం కుటుంబ జీవిత బీమా పథకాన్ని వివరించారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ఇంకా సమస్యలు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 6న ప్రారంభమైన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను, సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ కార్యక్రమం తో పాటు, అలైవ్ ,అరైవ్ , రోడ్డు భద్రత పై తీసుకున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










