Suryapet : వినాయక చవితి వేడుకలపై ముందస్తు నిఘా.. డీజేలపై కఠిన నిషేధం..!
సూర్యాపేట జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి నరసింహ ఆదేశించారు.

Suryapet : వినాయక చవితి వేడుకలపై ముందస్తు నిఘా.. డీజేలపై కఠిన నిషేధం..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి నరసింహ ఆదేశించారు. గురువారం రోజున సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను నిశితంగా పరిశీలించి సిబ్బంది విధి నిర్వహణ తీరును మరియు బాధితులకు అందుతున్న సేవలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అసాంఘిక చర్యలు, అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలి. పట్టణంలో కొత్త వ్యక్తుల కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలని , పెట్రో కార్, బ్లూ కోట్స్ సిబ్బంది నిరంతరాయంగా 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించాలని రాత్రి వేళ అనుమానితుల వేలిముద్రలు తనిఖీ చేయాలని అన్నారు.
ALSO READ : కొండా సురేఖ ఔట్.. ముగ్గురిని వరించిన పదవులు..!
నేరాల నియంత్రణకు పట్టణంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని సూచించారు, నిరంతరం వాహనాల తనిఖీలు చేయాలని అన్నారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి. స్థానిక పెద్దలతో, ఉత్సవ కమిటీలతో శాంతి సమావేశాలు నిర్వహించాలన్నారు.
గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి కమిటీలు ముందస్తుగా అనుమతులు తీసుకునేలా అవగాహన కల్పించాలని రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై వినాయక మండపాలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు.. పట్టణంలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయో ముందే అంచనా వేసి, వాటికి నెంబరింగ్ కేటాయించి, నిమజ్జన రూట్లను పరిశీలించాలాని అన్నారు.
పండుగల సందర్భంగా డీజేల వల్ల ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నందున డీజేల వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని, డీజే నిర్వాహకులను పిలిపించి ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు . డీజేల వల్ల కలిగే నష్టాలపై భక్తులకు, ఉత్సవ కమిటీలకు మరియు సాధారణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల వినతులు, ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
ఈ తనిఖీలో పట్టణ సిఐ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్ఐ లు సాయిరాం, రామచందర్, రహిముద్దిన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









