సైబర్ మోసంతో డబ్బులు పోయాయా.. ఐతే కాల్ మీ 1930
సైబర్ మోసంతో డబ్బులు పోయాయా.. ఐతే కాల్ మీ 1930
విద్యార్థులకు వివరించిన సూర్యాపేట డిఎస్పి నాగభూషణం
సూర్యాపేట, మనసాక్షి
విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నందు బుధవారం 10 వ తరగతి విద్యార్థులకు సైబర్ మోసాలు, ఆన్ లైన్ లో ఎదురయ్యే సమస్యల గురించి డిఎస్పి నాగభూషణం వివరించారు.
ఇంటర్నెట్ లో వచ్చే లింక్ లను క్లిక్ చేయవద్దని, పరిచయం లేని వారికి వ్యక్తిగత వివరాలు తెలుపవద్దని పోర్న్ సైట్ లు చూడడం ప్రమాదకరమని అన్నారు. ఏ బ్యాంకు నుండి కూడ ఎటిఎమ్, పిన్ నంబర్ లు చెప్పమని ఫోన్ చేయరని కాబట్టి బ్యాంకు ఖాతా వివరాలు, ఒటిపి నంబర్ ఎవరికి చెప్పవద్దని అన్నారు.
విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ తో గడపడం వలన అనేక సమస్యలు వస్తాయని చెప్పారు. పట్టణ సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకోవడం ప్రమాదకరమని చెప్పారు.
లోన్ యాప్ ల నిర్వహకులు పెట్టే వేధింపులకు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. సైబర్ మోసాల వలన డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కు ఫోన్ చేసి వివరాలు చెబితే పోగొట్టుకున్న సొమ్ము రికవరీ అయ్యే అవకాశం వుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.









