ఎంతకాలం అరెస్టులు చేస్తారు ..? జైల్లో పెడతారు..?
ఎంతకాలం అరెస్టులు చేస్తారు ..? జైల్లో పెడతారు..?
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాదులోని చంచల్ గూడ జైల్లో వైఎస్ షర్మిలని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిపై చేయి చేసుకున్న సంఘటనపై వివిధ సెక్షన్ల కింద వైఎస్ షర్మిలపై కేసులు నమోదు కాగా చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం వైఎస్ విజయమ్మ.. షర్మిలను పరమార్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, షర్మిల ప్రజల కోసం 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందన్నారు. షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని, ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుందన్నారు.
గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా.? షర్మిల సిట్ కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు? ఆమె క్రిమినలా? టెర్రరిస్టా? అన్నారు. ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుందని,
అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదు? ప్రశ్నించే గొంతుకల్ని అరెస్టులు చేయడం న్యాయమేనా? ఇదేనా ప్రభుత్వ విధానం? ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
ప్రజల సమస్యలు చూపిస్తుంటే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేయడమేంటి? ఎంత కాలం అరెస్టులు చేస్తారు.. జైల్లో పెడతారు? ఇలా అణచి వేస్తూ ప్రజలే ప్రశ్నించే రోజు తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నా అన్నారు.
ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన తీరు మార్చుకోకపోతే ప్రజలు, నిరుద్యోగులు సరైన సమాధానం చెప్తారని,
షర్మిల మళ్లీ బెయిల్ పై విడుదల అవుతుందని,
ప్రజలు, నిరుద్యోగుల కోసం పోరాడుతుందన్నారు.
ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. మీడియా ప్రజల కోసం పని చేయాలని,
మీడియా వాస్తవాలను మాత్రమే చూపించాలని కోరుతున్నామన్నారు.









