మీడియా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
మీడియా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
మీడియా అకాడమీ సెక్రటరి వెంకటేశ్వర రావు
జిల్లాలోని మీడియా మిత్రులందరూ పాల్గొని విజయవంతం చేయాలి
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నేడు రేపు పాత్రికేయులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించనున్నారన్నారు.
రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులలో పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని అన్నారు. వీటిలో రూ. 42 కోట్లు విడుదలవారీగా జర్నలిస్టుల సంక్షేమానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి లక్ష రూపాయల చొప్పున అందించామని, నేటి వరకు 456 మంది మృతి చెందిన జర్నలిస్టులకు కుటుంబాలకి అందించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆపద సమయంలో ఆదుకోవడానికి నెలకి రూ.3000 చొప్పున ఐదు సంవత్సరాల పాటు మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు అందిస్తున్నట్లు వివరించారు. కోవిడ్ సమయంలో సైతం కోవిడ్ బారిన పడిన 3965 మంది జర్నలిస్టులకు రూ.5.57కోట్లు అందివ్వడం జరిగిందన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులలో అనుభవజ్ఞులై న జర్నలిస్టులతో వివిధ అంశాల పై శిక్షణ అందించి వారికి సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల సమాచార అధికారి రమేష్ కుమార్, డిఐఈ మల్లేశ్, ఏవో పూర్ణచంద్రరావు, ఓ ఎస్ డి రెహమాన్ సిబ్బంది పాల్గొన్నారు.









