రాహుల్ పై వేటు మోడీ పన్నిన దుష్టపన్నాగం – మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
రాహుల్ పై వేటు మోడీ పన్నిన దుష్టపన్నాగం
మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి :
రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం, వేనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం చూస్తుంటే ఇదంతా బిజెపి కేంద్ర ప్రభుత్వం అధినేత నరేంద్ర మోడీ పన్నిన దుష్ట పన్నాగం లాగ అనిపిస్తుందని ఇంతటి అప్రజాస్వామికమైన చర్య ఇంకొకటి ఉండదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.
సోమవారం సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో రాహూల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన సత్యాగ్రహ దీక్ష లో ఆయన పాల్గొని స్వయంగా దీక్ష చేపట్టి, దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఏ తప్పూ చేయలేదని, దేశ సమైక్యత కోసం కనీవినీ ఎరుగని రీతిలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేపట్టిన నిస్వార్థమైన వ్యక్తి రాహూల్ గాంధీ అని ఆయన అన్నారు.
స్వాతంత్ర పోరాటంలో అగ్ర భాగాన నిలిచి, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల కుటుంబం నుండి వచ్చిన రాహూల్ గాంధీ ని అవమానపరిచే విధంగా ప్రవర్తించడం బిజెపి అనుసరిస్తున్న దుర్మార్గపు అప్రజాస్వామిక పనులకు పరాకాష్ఠ అని దామోదర్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ లో దేశ సమైక్యత కోసం పార్లమెంటు లో గళమెత్తుతూ, భారతదేశ సంపదను తన సన్నిహిత మిత్రులకు దోచి పెట్టడాన్ని పార్లమెంట్ లో నిలదీస్తూ, నల్లధనాన్ని వెలికితీసి ప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయలను జమ చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు లో రాహుల్ గాంధీ సమర్థవంతంగా తన గళాన్ని వినిపిస్తున్నారనే ఈలాంటి చర్యలకు వడిగట్టారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వేనారెడ్డి ,చకిలం రాజేశ్వరరావు ,కక్కిరెని శ్రీనివాస్ ,అంజద్ అలీ ,అలెటి మాణిక్యం , తదితరులు పాల్గొన్నారు.









