Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

District collector : వారం రోజుల్లో మార్పు రావాలి, లేదంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!

District collector : వారం రోజుల్లో మార్పు రావాలి, లేదంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!

నల్లగొండ, మన సాక్షి :

వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మార్పు రావాలి. విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనాలు అల్పాహారం వడ్డించాలి. లేదంటే చర్యలు తీసుకుంటానని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో పూర్తి నాణ్యత ఉండాలని ఆదేశించారు.

మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ పట్టణ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి 6, 7 వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న చదువు, భోజనం, అల్పాహారం, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

అల్పాహారాన్ని తక్కువగా ఇస్తున్నారని, దోమల సమస్య ఉందని, దుప్పట్ల కొరత ఉందని, ప్రత్యేకించి నోట్ బుక్కులు ,యూనిఫారమ్ కావాలని విద్యార్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితులలో మెనూ పాటించాలని, మెనూ ప్రకారం కాకుండా తగ్గించి భోజనం పెట్టినట్లయితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థులు కోరిన వాటన్నింటిని వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని, బాగా కష్టపడి చదువుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాల వంటగదిని తనిఖీ చేయడమే కాకుండా, మంగళవారం విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే అల్పాహారం, భోజనం వడ్డించాలని, ఎక్కడ తగ్గించడానికి వీల్లేదని ,వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మార్పు రావాలని, లేనట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు.

తక్షణమే పాఠశాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులు దోమలబారిన పడకుండా తలుపులు, కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్ పనులను చేయించాలని, పాఠశాలలో తరగతి గదులు, టాయిలెట్స్ అన్నింటికీ మరమ్మతులు చేయించిన తర్వాత కలర్ వేయించాలని, తక్షణమే నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయాల్సిందిగా డీఈఓ ను ఆదేశించారు.

పాఠశాలలో అవసరమైన లైట్లును సైతం ఏర్పాటు చేయాలని ,చిన్నచిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని ,ఇవన్నీ వారంలోపు పూర్తి కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలో ఉన్న టాయిలెట్స్, మొదటి అంతస్తులో ఉన్న హాల్ ను తనిఖీ చేసి వాటన్నింటినీ ఉపయోగం లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎంఈఓ అరుంధతి, ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు