క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఈ ముఠా మామూలోల్లు కాదు..!

Suryapet : ఈ ముఠా మామూలోల్లు కాదు..!

సూర్యాపేట, రూరల్, మనసాక్షి :

తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగల ముఠాను సూర్యాపేట రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రవి వివరాలు వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా నెల్లి కుదురు మండలం మునగల వీడు గ్రామానికి చెందిన దాసరి మురళి, దాసరి జంపయ్య, మాదగోని సుమన్‌, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన అంగడి సురేష్‌లు ముఠాగా ఏర్పడి స్థానిక జనగాం క్రాస్‌ రోడ్డులో దొంగతనం చేసేందుకు వచ్చి ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు పట్టుబడి చేసి విచారించగా 13 ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు నేరం అంగీకరించినట్లు చెప్పారు.

ఏ1 దాసరి మురళిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు కాగా చర్లపల్లి జైలులో 15 నెలలు శిక్ష అనుభవించినట్లు పేర్కొన్నారు. ఈ ముఠా 2023లో సిద్ధిపేట జిల్లా చినకోడూరు, బెజ్జంకి మండలం దాచారం, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మల పెన్‌పహాడ్‌, 2024లో సైబరాబాద్‌ నందిగామలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, రామగుండంలోని ఎన్‌టీపీఎం హనుమానగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట యాదాద్రి టౌన్‌ షిప్‌, కుడకుడ పీఎన్‌ఆర్‌ టౌన్‌, తలకొండపల్లి, రాయినిగూడెం గ్రామంలో నడుస్తున్న మహిళ పుస్తెల తాడు దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

నిందితుల నుంచి 10 తులాల బంగారం, 75 తులాల వెండి, 4 సెల్‌ఫోన్‌లు, 1 ఆటో, 2 మోటార్‌ సైకిల్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేర పరిశోధన చేసిన రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి, ఎస్‌ఐ బాలు నాయక్‌, సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఐ వెంకన్న, హెడ్‌కానిస్టేబుల్‌ ఇరుగు బాబు, ఎండీ అస్గర్‌ అలీ, చల్లా యాదగిరి, సుదర్శన్‌, శ్రీరాములు, ఉమా మహేష్‌, వేణు, రమేష్‌, వీరస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

రిపోర్టింగ్ : 

నాగరాజు, సూర్యాపేట రూరల్

మరిన్ని వార్తలు